సినిమా, సంగీతం, కళలు, క్రీడలు – ఇలా ఏ రంగమైనా, అందులో విశేష ప్రతిభ కనబరిచిన అలనాటి కొందరు వ్యక్తుల గురించి, వారి జీవితంలోని కొన్ని విశిష్ట ఘటనల గురించి, ఉదాత్త ఆశయాలతో జరిగిన కొన్ని కార్యక్రమాల గురించి అరుదైన విషయాలను అపురూపమైన చిత్రాలతో ‘అలనాటి అపురూపాలు’ పేరిట సంచిక పాఠకులకు అందిస్తున్నారు లక్ష్మీ ప్రియ పాకనాటి.
~
దోస్తీ 1964:
ప్రారంభం నుంచీ హిందీ సినిమాల ప్రధాన ఇతివృత్తం ప్రేమే, అయితే అన్నిసార్లూ అది మన సినిమాల్లో చూపించే రొమాంటిక్ లవ్ కాదు. అన్ని రకాల ప్రేమ – తల్లీపిల్లల ప్రేమ, అన్నా చెల్లెళ్ళ ప్రేమ, భక్తుని ప్రేమ, జంతుప్రేమని చూపిన ఎన్నో సినిమాలున్నాయి.
కాలక్రమంలో మన సినిమాలు అన్ని రకాల ప్రేమలనూ ప్రదర్శించి వేడుక చేసుకున్నాయి. అటువంటి ఓ గొప్ప ఉదాహరణ 1964 లో వచ్చిన సినిమా ‘దోస్తీ’. ఇది ఇద్దరు దివ్యాంగులైన అబ్బాయిల మధ్య ప్రేమను వర్ణిస్తుంది. ‘దోస్తీ’ ఉన్నతమైన స్నేహాన్ని మరొక స్థాయికి తీసుకెళ్లింది, ఈ సినిమా విడుదలైన 60 సంవత్సరాల తర్వాత కూడా, ఎవరూ దానికి దీటైన సినిమా తీయలేకపోయారు.
‘దోస్తీ’ అనేది రాము (సుధీర్ కుమార్), మోహన్ (సుశీల్ కుమార్) అనే ఇద్దరు అబ్బాయిల – హృద్యమైన కథ, వారు జీవితపు కఠిన వాస్తవాలను ధైర్యంగా, అలుపెరుగని స్నేహంతో ఎదుర్కొంటారు. ఈ చిత్రం ఒక పారిశ్రామిక ప్రమాదంలో రాము తండ్రి విషాదకరమైన మరణంతో ప్రారంభమవుతుంది, ఇది ఆ చిన్న పిల్లవాడికి మరింత దురదృష్టం కలిగించేలా వరుస సంఘటనలకు కారణమవుతుంది. ఈ వార్తతో కుంగిపోయిన అతని తల్లి, ఒక ప్రమాదంలో మరణిస్తుంది, రాము అనాథై, శారీరకంగా వికలాంగుడిగా మిగిలిపోతాడు.
రాము ముంబై వీధుల్లో తిరుగుతుండగా, పాడటంలో ప్రతిభ ఉన్న అంధ బాలుడు మోహన్ను కలుస్తాడు. వారిద్దరూ ఒక బంధాన్ని ఏర్పరుచుకుంటారు, వారి సంగీత సామర్థ్యాలను ఉపయోగించి జీవనోపాధి పొంది, సహనం లేని నగర వీధుల్లో మనుగడ సాగిస్తారు. వారి స్నేహం ఆశాదీపం, చీకటి సమయాల్లో కూడా మానవ సంబంధాలు కాంతిని పంచగలవనీ, ఉద్దేశాలని నెరవేర్చగలవనీ చెబుతుంది.
మెరుగైన జీవితాన్ని కోరుకునే ఆ ఇద్దరి పోరాటాలనీ, విజయాలనీ – ఈ కథనం వెల్లడిస్తుంది. రాము తన చదువును కొనసాగించాలని కలలు కంటుండగా, మోహన్ – ముంబైకి నర్సుగా పని చేయడానికి వెళ్లిన తన సోదరి మీనా (ఉమా రాజు)ని తిరిగి కలవాలని కోరుకుంటాడు. మంజుల అనే చిన్న అమ్మాయితో స్నేహం చేసినప్పుడు – ఈ అబ్బాయిల జీవితంలో ఉత్సాహవంతమైన క్షణాలు ఎదురవుతాయి. గుండె జబ్బుతో బాధపడే ఈ పాప పాత్రను బేబీ ఫరీదా అద్భుతంగా పోషించింది. అయితే, వారి మార్గం సామాజిక పక్షపాతం, వ్యక్తిగత ఎదురుదెబ్బలు వంటి సవాళ్లతో కూడా నిండి ఉంది.
‘దోస్తీ’ అనేది కేవలం దురదృష్టవంతులు ఎదుర్కొనే కష్టాల గురించిన కథ మాత్రమే కాదు; ఇది మానవ స్ఫూర్తి యొక్క పట్టుదలకు ఒక వేడుక. నిజమైన స్నేహితుడి మద్దతుతో కలిసి దృఢ సంకల్పం జీవితంలోని అడ్డంకులను ఎలా అధిగమించగలదో ఇది చూపిస్తుంది. ఈ సినిమా కథాంశం స్నేహం యొక్క శాశ్వత శక్తికి మరియు ఒకరినొకరు నమ్ముకునే వారికి అది అందించే బలానికి నిదర్శనం.
‘దోస్తీ’ సినిమా తీసిన కాలాన్ని పరిగణనలోకి తీసుకుంటే, దాని సాంకేతిక అంశాలు ప్రశంసనీయం. సినిమాటోగ్రాఫర్ మార్షల్ బ్రగంజా ముంబై వీధుల సారాన్ని, ప్రధాన పాత్రలు ఎదుర్కొంటున్న సవాళ్లను గొప్పగా ఒడిసిపట్టారు. సుధీర్ కుమార్ సావంత్, సుశీల్ కుమార్ నటన హృదయాన్ని కదిలించేలా ఉంటుంది, ఆ పాత్రల అనుభవాలకు ప్రామాణికతను తెచ్చింది. లీలా చిట్నిస్, లీలా మిశ్రా, అభి భట్టాచార్య, నానా పల్సికర్, ఇంకా కొత్త నటుడు సంజయ్ ఖాన్ వంటి దిగ్గజ నటులతో కూడిన అద్భుతమైన సహాయక తారాగణంతో ఈ చిత్రం సుసంపన్నం చేయబడింది.
‘దోస్తీ’ లో కథన సాధనంగా, ఇంకా భావోద్వేగ గాఢతకు మూలంగా సంగీతం కీలక పాత్ర పోషించింది. దిగ్గజ సంగీత దర్శకులు లక్ష్మీకాంత్-ప్యారేలాల్ స్వరపరిచిన ఈ సౌండ్ట్రాక్లో మజ్రూహ్ సుల్తాన్పురి సాహిత్యం మహమ్మద్ రఫీ స్వరం ద్వారా ప్రాణం పోసుకుంది. ‘చాహూంగా మై తుఝే’ అనేది అచంచలమైన మద్దతుని తెలిపే, స్నేహపు గంభీరమైన ప్రతిజ్ఞ, ఇక ‘మేరా తో జో భీ కదమ్’ అనే పాట భక్తిని, జీవిత ప్రయాణంలోని ప్రతి అడుగులో స్నేహితుడి ఉనికిని ప్రకటిస్తుంది. ఈ రెండు పాటలూ ముఖ్యంగా వాటి భావోద్వేగ ప్రతిధ్వనికి గుర్తించదగినవి, కాలక్రమేణా స్నేహానికి ప్రతీకైన గీతాలుగా మారాయి.
‘జానేవాలోం జరా ముడ్కే దేఖో ముఝే’ అనేది భగ్న హృదయపు యొక్క వేదనని వ్యక్తీకరిస్తుంది, కాగా ‘రాహి మన్వా దుఖ్ కీ చింతా’ అనే పాట జీవితంలోని దుఃఖాలను, పోరాటాలను ప్రదర్శిస్తుంది. ‘కోయి జబ్ రాహ్ నా పాయే’ రత్నం లాంటి పాట, ఇది – కష్టాలను ఎదుర్కొంటూ ఎప్పటికీ అంతం కాని ఆశావాదాన్ని వ్యక్తపరిచే గీతం. ఆల్బమ్లో లతా మంగేష్కర్ పాడిన ఏకైక పాట ‘గుడియా కబ్ తక్ నా హసోగి’, విచారంగా ఉన్న పాప ముఖంలో చిరునవ్వు తీసుకురావడానికి ప్రయత్నించే సున్నితమైన లాలిపాట.
‘దోస్తీ’ సంగీతం – అర్థవంతమైన సాహిత్యం నుండి ఎంతో ప్రయోజనం పొందింది, ఇది శ్రావ్యతకు సంపూర్ణంగా పూరకంగా ఉండి, సినిమా యొక్క భావోద్వేగ ప్రభావాన్ని పెంచింది. ఈ సాహిత్యం సినిమా యొక్క ప్రధాన ఇతివృత్తాల ప్రతిబింబం, స్నేహపు సూక్ష్మ నైపుణ్యాలను మరియు మానవ స్థితిగతులను వ్యక్తీకరిస్తుంది.
‘దోస్తీ’ సినిమా వాణిజ్యపరంగానూ విమర్శకుల పరంగానూ విజయవంతమై, ఆరు ఫిల్మ్ఫేర్ అవార్డులను గెలుచుకుంది, సినీ ప్రియుల హృదయాల్లో స్థానం సంపాదించింది. ‘దోస్తీ’ ఉత్తమ చిత్రం, ఉత్తమ సంగీత దర్శకుడు (లక్ష్మీకాంత్ ప్యారేలాల్) మరియు ఉత్తమ కథ (బాణ్ భట్) కు ఫిలింఫేర్ అవార్డులను గెలుచుకుంది.
ఉత్తమ డైలాగ్ (గోవింద్ మూనిస్), ఉత్తమ నేపథ్య గాయకుడు (మహమ్మద్ రఫీ ‘చాహూంగా మైన్ తుజే సాంజ్ సవేరే’ పాటకు), ఇంకా ఉత్తమ గీత రచయిత (‘చాహూంగా మైన్ తుజే సాంజ్ సవేరే’ పాటకు మజ్రూహ్ సుల్తాన్పురి) పురస్కారాలను గెల్చుకుంది.
దర్శకుడు సత్యేన్ బోస్ ఫిల్మ్ఫేర్ ఉత్తమ దర్శకుడి అవార్డుకు నామినేట్ అయ్యారు. ఇది సత్యేన్ బోస్ కెరీర్లో అత్యంత విజయవంతమైన చిత్రాలలో ఒకటిగా నిలిచింది, ఆయనను సినీరంగపు గొప్పవారిలో ఒకరిగా నిలబెట్టింది.
ఈ చిత్రం యూట్యూబ్లో లభ్యం. పూర్తి సినిమాని లేదా పాటలని చూసెయ్యండి!
https://www.youtube.com/watch?reload=9&v=P3tTfZtvFDQ
పాకనాటి లక్ష్మీ ప్రియ, బాల్యం నుండే పాత సినిమాలు, సంగీతం పట్ల అభిరుచి కలిగి ఉన్నారు. చలన చిత్రాల విషయ సేకరణకర్త అయిన తన తండ్రిగారి నుండి ఎన్నో సంగతులు తెలుసుకున్నారు, నేర్చుకున్నారు. ఈ సంప్రదాయాన్ని ఆమె సోదరుడు కొనసాగిస్తున్నారు, వారి ఇల్లు సేకరణల నిధి. పుస్తక పఠనం పట్ల ఆసక్తిగల లక్ష్మీ ప్రియ నిత్య విద్యార్థిగా ఉండడానికి ఇష్టపడతారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి ఎం.ఎస్.సి జువాలజీలో బంగారు పతకం సాధించారు. అదే విశ్వవిద్యాలయం నుండి ఎంబిఎ చేశారు. ఒక బిజినెస్ స్కూల్లో మార్కెటింగ్ బోధించారు. సున్నితమైన ఆరోగ్యం కారణంగా ఉద్యోగాన్ని విడిచిపెట్టారు. ప్రస్తుతం – పాతకాలపు అభిమానుల ఆనందం కోసం, వారు పాత చిత్రాలు, పాటలు మరియు సమాచార పోస్ట్లను ఆస్వాదించేందుకు ఫేస్బుక్లో మ్యూజిక్ గ్రూప్స్ నిర్వహిస్తున్నారు.