సినిమా, సంగీతం, కళలు, క్రీడలు – ఇలా ఏ రంగమైనా, అందులో విశేష ప్రతిభ కనబరిచిన అలనాటి కొందరు వ్యక్తుల గురించి, వారి జీవితంలోని కొన్ని విశిష్ట ఘటనల గురించి, ఉదాత్త ఆశయాలతో జరిగిన కొన్ని కార్యక్రమాల గురించి అరుదైన విషయాలను అపురూపమైన చిత్రాలతో ‘అలనాటి అపురూపాలు’ పేరిట సంచిక పాఠకులకు అందిస్తున్నారు లక్ష్మీ ప్రియ పాకనాటి.
~
గాయని, నటి జహనారా కజ్జన్:
రంగస్థల రాణిగా పేరు పొందిన జహనారా కజ్జన్ ఆకర్షణీయమైన సినీ నటి, శిక్షణ పొందిన గాయని, మోడరన్ ఫ్యాషనబుల్ గర్ల్, ఇంకా ట్రెండ్సెట్టర్. మిస్ కజ్జన్గా ప్రసిద్ధి చెందిన జహనారా కజ్జన్ లేదా కజ్జన్ బాయిది బహుముఖ ప్రజ్ఞ గల అద్భుతమైన వ్యక్తిత్వం. సినీ ప్రస్థానంలో ఉచ్చస్థితిలో ఉండగా, ఆమెను ‘లార్క్ ఆఫ్ హిందీ సినిమా’ అనీ, ‘బ్యూటిఫుల్ నైటింగేల్ ఆఫ్ బెంగాల్ స్క్రీన్’ అనీ గౌరవించడంలో ఆశ్చర్యమేమీ లేదు. లాహోర్లోని మదన్ థియేటర్లో ‘లైలా మజ్ను’ (1931) విడుదల సందర్భంగా మిస్ కజ్జన్ అద్భుతమైన చిత్రాలతో నగరం అంతటా పోస్టర్లు, ఆకర్షణీయమైన హోర్డింగ్ల ద్వారా గొప్ప ప్రచారం చేశారు. అప్పటికి టాకీ సినిమాలు కొత్త, దాంతో సినిమా హాళ్ళు పెద్ద సంఖ్యలో ప్రేక్షకులను ఆకర్షించాయి. అప్పటి సినిమాలు ఎక్కువగా పాటలతో నిండిపోయాయి. రంగస్థలంపై అత్యంత ప్రజాదరణ పొందిన నటగాయక జంట మిస్ కజ్జన్, మాస్టర్ నిస్సార్ నటించిన ‘లైలా మజ్ను’ అద్భుతమైన విజయాన్ని సాధించింది. ఈ చిత్రంలో మజ్ను (నిస్సార్) అరణ్యంలో లైలా (కజ్జన్) కోసం వెతుకుతూ, “లైలా లైలా పుకారూఁ మై బన్ మే, లైలా ప్యారీ బసి మోరె మన్ మే” అని పాడతాడు.
ఆ రోజుల్లో సినిమా మ్యాగజైన్లు లేవు, తారల స్పైసీ ఇంటర్వ్యూలను ప్రచురించే ఆచారం ఇంకా రెండు దశాబ్దాల దూరంలో ఉంది. దక్షిణాసియా థియేటర్ చరిత్రలో ప్రముఖ పండితురాలు కాథరిన్ హాన్సన్ తన పుస్తకం “స్టేజెస్ ఆఫ్ లైఫ్” (2011) లో కజ్జన్ గురించి ప్రస్తావించారు. జహనారా కజ్జన్ (1915-1945) అక్కడ ‘ప్రసిద్ధ గాయని నటి, అంతఃపురవాసి సుగ్గన్కీ, భాగల్పూర్ నవాబ్కీ పుట్టిన కుమార్తె’ అని రాశారు. ప్రామాణికమైన సమాచారం అందుబాటులో లేనందున ఆమె పుట్టిన తేదీ ప్రశ్నార్థకమే. రంగస్థల, సినిమా నటీమణులుగా ప్రసిద్ధి చెందిన వృత్తిపరమైన తరగతికి చెందిన మహిళా కళాకారులందరికీ ఇది వర్తిస్తుంది. ఏది ఏమైనప్పటికీ, 1920ల చివరలో, 30వ దశకం ప్రారంభంలో కజ్జన్ గారి రంగస్థల, సినీ కెరీర్ నుండి సేకరించిన సందర్భోచిత సాక్ష్యం, ఇంకా ఆ కాలంలో ఆమె ప్రేమ వ్యవహారాలకు సంబంధించిన కొన్ని ప్రస్తావనలు – ఆమె ఎప్పుడో 1910లో జన్మించినట్లు ఊహించేలా చేస్తాయి.
కజ్జన్ వృత్తిపరమైన కళాకారుల కుటుంబానికి చెందినవారు, వారు తవాయిఫ్లు లేదా వేశ్యలు అనే ట్యాగ్ని కలిగి ఉన్నారు. తమ వ్యక్తిగత మెహఫిల్స్లో ప్రదర్శనలివ్వడానికి రాచరిక సంస్థానాలు, ప్రభువులచే ఆహ్వానించబడ్డారు. తమ నాగరీకమైన మర్యాదలతో వారు కులీన పురుషులకు ఉత్తేజపరిచే సాహచర్యాన్ని అందించారు. వృత్తిలో వారి ప్రవర్తనా నియమావళి ప్రకారం వారు వివాహం చేసుకోకూడదు, కానీ వారు ఎంచుకున్న పోషకుడితో కలిసి ఉండవచ్చు. కజ్జన్ తల్లి సుగ్గన్ కజ్జన్ తండ్రితో అలాంటి సంబంధాన్నే కలిగి ఉండేది.
20వ శతాబ్దం ప్రారంభంలో యాంటీ-నాచ్ ఉద్యమం – గానం నృత్య సంబంధిత వృత్తిని తీవ్రంగా నష్టపరిచింది. వారిలో కొందరు గ్రామోఫోన్ గాయకులు లేదా రంగస్థల నటులయ్యారు. కజ్జన్ ఇంట్లో విద్యను అభ్యసించారు, ఇంగ్లీష్ కూడా నేర్చుకున్నారు. ఉర్దూ సాహిత్యంలో చక్కని ప్రావీణ్యం ఉన్న ఆమె ‘అదా’ అనే కలం పేరుతో కవిత్వం రాశారు, ఆమె కవితలు కొన్ని ఉర్దూ పత్రికలలో ప్రచురితమయ్యాయి. ఆమె పాట్నాకు చెందిన ఉస్తాద్ హుస్సేన్ ఖాన్ నుండి హిందుస్థానీ శాస్త్రీయ సంగీతంలో చక్కని శిక్షణ పొందారు. రాగాలపై ఆమెకున్న ప్రావీణ్యం, ఆమె మధురమైన స్వరం, ఆమె మనోహరమైన రూపాన్ని గమనించిన, పాట్నాలోని ఒక థియేటర్ కంపెనీ ఆమెను ప్రదర్శనకి ఎంచుకుంది. ఒక్కో షోకు రూ.250 చొప్పున మూడు రోజుల పాటు స్టేజీపై ప్రదర్శన ఇచ్చారని చెప్తారు. ఆమె తన బంగారు స్వరంతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు. ఇది ఆమె కలకత్తాలోని మదన్ థియేటర్స్ యాజమాన్యంలోని ఆల్ఫ్రెడ్ కంపెనీలో చేరడానికి మార్గం సుగమం చేసింది. పార్సీ థియేటర్ దిగ్గజం ఫిదా హుస్సేన్ వెల్లడించిన వివరాల ప్రకారం, “ఆయన నటి జహనారా కజ్జన్తో కలిసి పనిచేశాడు, ఆమెకి దర్శకుడిగా, కథానాయకుడిగా పనిచేశారు”. కజ్జన్ చాలా ప్రసిద్ధ గాయని, రంగస్థల నటిగా పేరుప్రతిష్ఠలు పొందారు.
1931లో టాకీ సినిమాల ఆగమనం వినోద రంగంలో విప్లవాన్ని తీసుకొచ్చింది. మార్చి 1931లో మొదటి టాకీ ‘ఆలమ్ ఆరా’ సాధించిన అద్భుతమైన విజయం అనేక మంది నిర్మాతలను ‘అందరూ మాట్లాడే, పాడే, నృత్యం చేసే’ చిత్రాలను రూపొందించడానికి ప్రేరేపించింది. కలకత్తాలోని మదన్ థియేటర్స్, అప్పటికే రంగంలోకి దిగి, ప్రఖ్యాత నాటక రచయిత అఘా హషర్ కాశ్మీరీ రచించిన రంగస్థల నాటకం ఆధారంగా ‘షిరిన్ ఫర్హాద్’తో తెరపైకి వచ్చినప్పుడు ‘ఆలమ్ ఆరా’ కంటే కొన్ని వారాల వెనుకబడి ఉంది. కానీ ‘షిరిన్ ఫర్హాద్’, ‘ఆలమ్ అరా’ను ఓడించింది, ఎందుకంటే అది సాంకేతికంగా మరింత మెరుగుపడింది; పైగా అప్పటికే సుప్రసిద్ధులైన గాయక జోడీ కజ్జన్, నిస్సార్లు పాడిన 42 పాటలను కలిగి ఉంది. కజ్జన్ హిందీ సినిమా మొదటి సూపర్ స్టార్గా అవతరించడంతో ఈ చిత్రం భారతదేశం అంతటా అద్భుతమైన విజయాన్ని సాధించింది. లాహోర్లోని ఒక టాంగావాలా ‘షిరిన్ ఫర్హాద్’ సినిమాని 22 సార్లు చూసేందుకు తన గుర్రాన్ని తాకట్టు పెట్టాడని అంటారు. దీని తర్వాత ఇదే జోడీ – కజ్జన్, నిస్సార్ నటించిన మరో సూపర్ హిట్ ‘లైలా మజ్ను’ వచ్చింది. అవధ్ సంస్థానం చివరి నవాబు అయిన వాజిద్ అలీ షా ఆస్థాన కవి అఘా హసన్ అమానత్ రాసిన నాటకం ఆధారంగా రూపొందిన ‘ఇంద్రసభ’ చరిత్ర సృష్టించింది. 71 పాటలతో విడుదలైన ఈ చిత్రం ఇప్పటికీ ‘అత్యధిక పాటలు కలిగిన చిత్రం’గా ప్రపంచ రికార్డును కలిగి ఉంది. మూడున్నర గంటల (211 నిమిషాలు) నిడివి ఉన్న ఈ చిత్రం పూర్తిగా పద్యాలతో ఉంటుంది. కజ్జన్ అనేక పాటలు పాడారు, ఇది దేశవ్యాప్తంగా ఘన విజయాన్ని అందించింది.
కజ్జన్ పాడిన పాటలలో – ‘తూనే తో మోరా మన్ హార్ లీనో మోరే బాంకే సాఁవరియా’, ‘చమన్ కో యూఁ మేరీ సఖీ నే మైఖానా బనా దియా’; ‘కబ్ సే ఖడీ హూఁ తేరే ద్వార్, బులా లే మోహే బలం రే’ వంటివి అత్యంత ప్రజాదరణ పొందిన పాటలు. ‘బిల్వమంగళ్’, ‘శకుంతల’, ‘అలీబాబా ఔర్ చాలీస్ చోర్’, ‘ఆంఖ్ కా నషా’, ‘జెహారీ సాంప్’ మొదలైనవి ఆమె గుర్తుండిపోయే సినిమాల్లో కొన్ని.
1930ల మధ్య నాటికి, పాటలు ఎక్కువగా ఉండే సినిమాలు, పౌరాణిక కథల సినిమాలు, పర్షియన్ ప్రేమకథల సినిమాల పట్ల తొలి ఉత్సాహం తగ్గిపోయింది. దాంతో చాలా మంది చిత్ర నిర్మాతలు.. మదన్ థియేటర్తో సహా తమ సంస్థలని మూసివేయవలసి వచ్చింది. కజ్జన్ వంటివారు పాడిన శాస్త్రీయ గీతాలు వాటి ఆకర్షణను కోల్పోయాయి, పైగా ఆమె రంగస్థల నటనా శైలి కూడా అలాగే ఉంది. కొత్త నిర్మాతల నుంచి ఆఫర్లు అందుకోవడంలో ఆమె విఫలమయ్యారు. సంపన్న మహిళ కావడంతో, ఆమె కలకత్తాలో ఉండిపోయారు, కానీ కొన్ని సంవత్సరాల తర్వాత ఆర్థిక వనరులు క్షీణించడంతో, ఆమె బొంబాయికి వెళ్లవలసి వచ్చింది. ముఖ్యంగా పార్శీ థియేటర్కి చెందిన సోహ్రాబ్ మోడీతో ఆమెకు ఉన్న పార్శీ సంబంధం, ఆమెకు అక్కడ కొన్ని సినిమాల్లో నటిగా అవకాశాలు రావడంలో సహాయపడింది. బొంబాయిలో కజ్జన్ కెరీర్ 1941 నుండి 1944 వరకు స్వల్పకాలం పాటు కొనసాగింది, ఆ సమయంలో ఆమె ఆరు చిత్రాలలో కనిపించారు. సోహ్రాబ్ మోడీ తీసిన “పృథ్వీ వల్లభ్” మినహా. పైగా, ఆమెకు చిన్న చిన్న పాత్రలు మాత్రమే లభించాయి. అంతే కాకుండా, తన గాన ప్రతిభని ప్రదర్శించడానికి తక్కువ అవకాశాలు లభించాయి.
ఆమె కలకత్తాలో విలాసవంతమైన జీవితాన్ని గడిపారు. ఆమెకు పెంపుడు జంతువులంటే చాలా ఇష్టం, ఆమె కొంతకాలం రెండు పులి పిల్లలను కూడా పెంచారు. కజ్జన్ మోడరన్ ఫ్యాషనబుల్ గర్ల్గా పిలవబడ్డారు. 1920ల చివరి నాటి స్టూడియో పోర్ట్రెయిట్ – ఆమె మేకప్, చెవి రింగులు, ముక్కు పిన్ ధరిచి, చేతి వేలితో వెంట్రుకలను చుడుతున్నట్లు, లేస్డ్ బ్లౌజ్తో చీరను ధరించినట్లు చూపిస్తుంది. ఈ ఛాయాచిత్రం ‘ది క్రైసిస్’ (న్యూయార్క్, 1928) ద్వారా ఫేస్ పౌడర్, హెయిర్ ప్రొడక్ట్స్ కోసం ఒక ప్రకటనలో ప్రదర్శించబడింది. కజ్జన్ పాశ్చాత్య నృత్యం నేర్చుకున్నారు, కలకత్తా క్లబ్కు తరచూ వెళ్ళేవారు, అక్కడి కులీన పురుషులతో స్వేచ్ఛగా కలిసిపోయారు. వ్యక్తిగతంగా, ఆమె చాలా మంది సహ నటులతో ప్రేమ వ్యవహారాలతో రంగుల జీవితాన్ని గడిపారు. ఆమె థియేటర్ డైరెక్టర్, సహనటుడు ఫిదా హుస్సేన్, ఆమెతో తన శృంగార సంబంధం గురించి బహిరంగంగా మాట్లాడారు. ప్రముఖ నటీమణి దేవికా రాణితో సంబంధం ఉందన్న ఆరోపణలపై బాంబే టాకీస్ సంస్థ నుంచి తొలగించబడ్డ – అప్పట్లో చాలా అందగాడిలా పేరుపొందిన నటుడు నజ్ముల్ హసన్తో కజ్జన్ కలకత్తాలోని న్యూ థియేటర్స్లో పనిచేస్తున్నప్పుడు సన్నిహితంగా ఉండేవారు. బొంబాయిలో ఆమె వ్యక్తిగత జీవితం గురించి చాలా తక్కువ సమాచారం ఉంది, ఆమె 1945లో మరణించారు.
ఈ లింక్లో జహనారా కజ్జన్ పాడిన ‘తుమ్రే దర్శన్ కో..’ అనే పాట వినండి-
https://www.youtube.com/watch?v=zRNEJcIZ7LQ
పాకనాటి లక్ష్మీ ప్రియ, బాల్యం నుండే పాత సినిమాలు, సంగీతం పట్ల అభిరుచి కలిగి ఉన్నారు. చలన చిత్రాల విషయ సేకరణకర్త అయిన తన తండ్రిగారి నుండి ఎన్నో సంగతులు తెలుసుకున్నారు, నేర్చుకున్నారు. ఈ సంప్రదాయాన్ని ఆమె సోదరుడు కొనసాగిస్తున్నారు, వారి ఇల్లు సేకరణల నిధి. పుస్తక పఠనం పట్ల ఆసక్తిగల లక్ష్మీ ప్రియ నిత్య విద్యార్థిగా ఉండడానికి ఇష్టపడతారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి ఎం.ఎస్.సి జువాలజీలో బంగారు పతకం సాధించారు. అదే విశ్వవిద్యాలయం నుండి ఎంబిఎ చేశారు. ఒక బిజినెస్ స్కూల్లో మార్కెటింగ్ బోధించారు. సున్నితమైన ఆరోగ్యం కారణంగా ఉద్యోగాన్ని విడిచిపెట్టారు. ప్రస్తుతం – పాతకాలపు అభిమానుల ఆనందం కోసం, వారు పాత చిత్రాలు, పాటలు మరియు సమాచార పోస్ట్లను ఆస్వాదించేందుకు ఫేస్బుక్లో మ్యూజిక్ గ్రూప్స్ నిర్వహిస్తున్నారు.