Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

అలనాటి అపురూపాలు – 269

సినిమా, సంగీతం, కళలు, క్రీడలు – ఇలా ఏ రంగమైనా, అందులో విశేష ప్రతిభ కనబరిచిన అలనాటి కొందరు వ్యక్తుల గురించి, వారి జీవితంలోని కొన్ని విశిష్ట ఘటనల గురించి, ఉదాత్త ఆశయాలతో జరిగిన కొన్ని కార్యక్రమాల గురించి అరుదైన విషయాలను అపురూపమైన చిత్రాలతో ‘అలనాటి అపురూపాలు’ పేరిట సంచిక పాఠకులకు అందిస్తున్నారు లక్ష్మీ ప్రియ పాకనాటి.

~

తెలుగు సినీ పరిశ్రమలో అత్యంత ఖరీదైన పొరపాటు – ‘ప్రపంచం’ (1953) సినిమా:

1950లో ఒక సింహళ వ్యాపారవేత్త కొలంబో నుండి మద్రాస్‌లోకి అడుగుపెట్టాడు.

అతని భార్య ఒక చిన్న కథ రాసింది, దానిని ఎలాగైనా సినిమాగా తీయాలని అనుకున్నాడు. అతను ఆ కథను ఇండస్ట్రీ పెద్దలకు చూపించాడు. అతని కథను సినిమాగా తీయలేమని, హిట్ సినిమాకి మంచి కథ, వేదన, ప్రేమ, హాస్యం, అద్భుతమైన క్లైమాక్స్ మొదలైనవి అవసరమని వారు చెప్పారు. ఈ కథలో ఇవేవీ లేవు. అతను నిర్ఘాంతపోయాడు కానీ ఆ కథను సినిమాగా తీయాలనుకున్నాడు. అతను మొండిగా మారి తన దగ్గర ఉన్న లక్షలాది డబ్బును ‘ప్రపంచం’ అనే ఈ ప్రాజెక్ట్‌లో పెట్టాలని నిర్ణయించుకున్నాడు. ఈ ధనవంతుడి పేరు ఎం.హెచ్.ఎం. మునాస్.

ఎం.హెచ్.ఎం. మునాస్, ఆయన శ్రీమతి

మునాస్ 1915 ఫిబ్రవరి 24న కొలంబోలో జన్మించాడు. అతను ఒక సంపన్న వ్యాపార కుటుంబానికి చెందినవాడు, కొలంబోలో ప్రసిద్ధి చెందిన వ్యక్తి. అతని తాత శాసనమండలి సభ్యుడు, ఆయన 1890లో మరణించాడు. మునాస్ తండ్రి పేరుమోసిన న్యాయవాది, చక్కని వ్యాపారవేత్త కూడా. మునాస్ ఆరుగురు తోబుట్టువులలో పెద్దవాడు. తరువాతి ఇద్దరు కూడా వ్యాపారంలో ఉన్నారు, తరువాతి ఇద్దరు ఆ సమయంలో చదువుకుంటున్నారు.

మునాస్ మామూలు చదువులు చదివాడు. తర్వాత లా కాలేజీలో కూడా చేరాడు కానీ అతని మనసు చదువుపై లేదు. 1933లో అతను వ్యాపారం చేయాలనుకున్నాడు. రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభమైన తర్వాత అతను సైనిక కాంట్రాక్టులు తీసుకోవడం ప్రారంభించాడు. అతనికి దిగుమతి-ఎగుమతి వ్యాపారం కూడా ఉంది, అతను చాలా సంపన్నుడయ్యాడు. 1945లో, ఇండో నేషనల్ బ్యాంక్‌ను స్థాపించి దాని మేనేజింగ్ డైరెక్టర్ అయ్యాడు.

అయినప్పటికీ మునాస్ సంతృప్తి చెందలేదు. చిన్నప్పటి నుండి అతనికి సాహిత్యం, పుస్తకాలు చదవడం చాలా ఇష్టం. అతను డబ్బుని, పుస్తకాలని కూడబెట్టడం ప్రారంభించాడు. అతను ప్రధానంగా షేక్‌స్పియర్ రచనలను చదివి వాటిని తన నరనారాల్లో జీర్ణించుకున్నాడు. సాహిత్యం గురించి ఎవరైనా ఏదైనా వ్యాఖ్య చేస్తే, అతను తనకు ఇష్టమైన అంశంపై అనర్గళంగా మాట్లాడేవాడు. అతనికి ప్రాచీన తమిళం కూడా తెలుసు, తమిళ సాహిత్యపు పాత పుస్తకాలను విస్తృతంగా చదివాడు.

అతను త్వరలోనే తమిళంలో, ఆంగ్లంలో కవితలు రాయడం మొదలుపెట్టాడు. వ్యాపారంలో బిజీగా ఉన్నప్పటికీ, కవిత్వం తనలో పొంగిపొరలుతోందని, ఆ సమయాలలో కవితలని చాలా వివరంగా రాయడానికి తన పనిని ఆపేస్తుంటానని మునాస్ పేర్కొన్నాడు.

వ్యాపారం కొనసాగించాలా లేక పుస్తకాల ప్రపంచంలో మునిగిపోవాలా అనేది ఆయనకి ఓ సమస్యగా ఉండేది. అయితే సినిమా నిర్మించాలని నిర్ణయించుకున్నప్పుడు అకస్మాత్తుగా తన సమస్యను పరిష్కరించుకున్నాడు. సినిమా మాధ్యమాన్ని అర్థం చేసుకోవడానికి సినిమాలు చూడాలని నిర్ణయించుకున్నాడు. అతను చూసిన మొదటి చిత్రం టి.పి. రాజ్యలక్ష్మి నటించిన తమిళ చిత్రం ‘సావిత్రి సత్యవన్’. అతను ఒక రోజులో అన్ని షోలను చూడటం ద్వారా 70 సార్లు ఈ సినిమా చూశాడు. ఇలా చాలా రోజుల చూశాడు. ఇతివృత్తం తెలుసు, తరువాత సీన్‍లో ఏం వస్తుందో కూడా తెలుసు కాబట్టి అతను సినిమాను నిర్భావంగా చూశాడు. నటించేటప్పుడు నటీనటుల ముఖ కవళికల తీవ్రత అతనికి చికాకు కలిగించింది. క్రమంగా తన సినిమా ఎలా ఉండాలో అతనికి ఒక ఆలోచన వచ్చింది. ఈ స్పష్టతను దృష్టిలో ఉంచుకుని అతను మద్రాస్ వెళ్ళాడు. కానీ ఎవరూ అతన్ని ప్రోత్సహించలేదు. అతని సినిమా కథ పనిచేయదని అందరూ చెప్పారు. ఎలాగైనా ఈ సినిమా తీయాలని నిర్ణయించుకున్న తర్వాత, తన డబ్బునంతా ఈ ప్రాజెక్ట్‌లో పెట్టేందుకు సిద్ధమయ్యాడు మునాస్.

1950లో, ఏప్రిల్‌లో, స్క్రిప్ట్ రాయడం ప్రారంభించి నాలుగు నెలల్లో పూర్తి చేశాడు. ఈ చిత్రానికి దర్శకత్వం వహించడానికి ఎల్.ఎస్. రామచంద్రన్‌ను బుక్ చేసుకున్నారు. 160 మంది నటీనటులను ఎంపిక చేసుకున్నాడు. అయితే వారందరినీ నియంత్రించడం బాగా కష్టమైంది. లక్ష్మీకాంత, రామస్వామి ఒక జంట; కనకం, నల్ల రామూర్తి మరొక జంట. షావుకారు జానకి, జి వరలక్ష్మి, నాగయ్య, లలిత, పద్మిని, కమల లక్ష్మణ్, ఛాయాదేవి, ఈలపాట రఘురామయ్య మొదలైనవారు తారాగణంగా భాగమై ఆసక్తి కల్గించారు. అప్పట్లో మద్రాసులో రెజ్లింగ్ చాలా ప్రసిద్ధి చెందింది కాబట్టి రెజ్లర్లు దారా సింగ్, అలీ రెజా మధ్య జరిగిన మ్యాచ్‌నీ సినిమాలో చేర్చారు.

మునాస్ చాలా ముందుగానే సెట్‌లకు వచ్చి చిత్రీకరించిన వాటిని నిశితంగా పరిశీలించేవాడు. అతనికి ఏదైనా నచ్చకపోతే తిరిగి షూట్ చేయమని ఆదేశించేవాడు. ఎందుకంటే, అతనికి డబ్బు వృథా అవుతుందనే భయం లేదు. 3 సంవత్సరాల తరువాత సినిమా పూర్తయింది. తెలుగులో ‘ప్రపంచం’, తమిళంలో ‘ఉలగం’ అన్న పేరుతో విడుదలవబోతున్న తన చిత్రంలో ఎటువంటి లోపాలు లేవని నిర్ధారించుకోవడానికి మునాస్ ఆ సినిమాను 500 సార్లకి పైగా చూశాడు. అతని 160 మంది కళాకారుల తారాగణం అదుపు తప్పిపోయింది.

యాదృచ్ఛికంగా కవి శ్రీశ్రీ మొదటిసారిగా ఈ సినిమాలో కనిపించారు. ప్రచారం కోసం విమానం నుండి మద్రాస్ నగరంపై కరపత్రాలు విసిరారు. ఈ సినిమా గురించి, దాని భారీ బడ్జెట్ గురించి ప్రజలు మాట్లాడుకోసాగారు. ఆ రోజుల్లో సినిమాలు 3 లేదా 4 లక్షలతో నిర్మించడి లాభాలను కూడా ఆర్జించేవి. అంతకు ఎన్నో రెట్లు ఎక్కువ ఖర్చు చేసిన ఈ సినిమా తెలుగు, తమిళ భాషలలో విడుదలై పూర్తిగా పరాజయం పాలైంది. ఇది 105 థియేటర్లలో విడుదలైంది కానీ రెండు వారాల్లోనే సినిమా డబ్బాలు వెనక్కి వచ్చేశాయి.

సినిమాది చాలా సింపుల్ ప్లాట్. ఒక పేదవాడు బాగా కష్టపడి ధనవంతుడు అవుతాడు. అతనికి ఇద్దరు కొడుకులు ఉంటారు, వాళ్ళిద్దరూ వ్యాపారం నడపడంలో గొడవ పడుతుంటారు. పైగా వారి భార్యలు కూడా గొడవల్లో చేరినప్పుడు ఇల్లు నరకంగా మారుతుంది. చివరికి అన్ని సమస్యలు పరిష్కారమవుతాయి.

సినిమా ప్రమోషన్‌లో భాగంగా, మునాస్ ఒక క్విజ్‌ను ప్రకటించాడు, అందులో మొదటి బహుమతి 25000 రూపాయలు, రెండవ బహుమతి 15000 రూపాయలు మరియు మూడవ బహుమతి 1000 రూపాయలు మరియు మొత్తం 50,000 బోనస్ బహుమతులు ఉన్నాయి.

ప్రేక్షకులు ఆ సినిమా టికెట్‌ను చూపిస్తూ, అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వవలసి వచ్చింది. సినిమాలో ఏది ఉత్తమ పాట అనేది ఒక ప్రశ్న. నటీనటులలో అత్యంత విషాదకరమైన పాటను ఎవరు పాడారు? ఎవరు బాగా నృత్యం చేశారు? వంటివి ఇతర ప్రశ్నలు. ఈ క్విజ్ పోటీ 1953 డిసెంబర్ 31న ముగిసింది.

మునాస్ భారతదేశంలో 14 సంవత్సరాలు ఉన్నాడు, తన సంపద అంతా ఖర్చు పెట్టాడు. ఆ తరువాత శ్రీలంకకి తిరిగి వెళ్ళిపోయాడు.

Exit mobile version