సినిమా, సంగీతం, కళలు, క్రీడలు – ఇలా ఏ రంగమైనా, అందులో విశేష ప్రతిభ కనబరిచిన అలనాటి కొందరు వ్యక్తుల గురించి, వారి జీవితంలోని కొన్ని విశిష్ట ఘటనల గురించి, ఉదాత్త ఆశయాలతో జరిగిన కొన్ని కార్యక్రమాల గురించి అరుదైన విషయాలను అపురూపమైన చిత్రాలతో ‘అలనాటి అపురూపాలు’ పేరిట సంచిక పాఠకులకు అందిస్తున్నారు లక్ష్మీ ప్రియ పాకనాటి.
~
నటుడు వస్తి
రియాసత్ అలీ వస్తి, బహుశా, నేటి తరం వారికి ఈ పేరు తెలియకపోవచ్చు, కానీ 1930, 1940 దశకాలలో భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ప్రముఖ నటుడాయాన. ఆవాజ్ (1942), సంజోగ్ (1943), రత్తన్ (1944), బాలమ్ (1949), గుమస్తా (1951), జబ్ ప్యార్ కిసీ సే హోతా హై (1961), పతంగా (1971) వంటి చిత్రాలకు ప్రసిద్ధి చెందారు.
వస్తి 1912లో ఉత్తర్ ప్రదేశ్ లోని నాగోన్లో జన్మించారు. ఆయన తండ్రి , హైదర్ హుస్సేన్ బుందేల్ఖండ్ ఏజెన్సీలో బాధ్యతాయుతమైన అధికారి. అక్కడ ఆయన సిటీ మేజిస్ట్రేట్గా వివిధ హోదాలలో పనిచేశారు, తరువాత న్యాయమూర్తి, దీవాన్ అయ్యారు. మెట్రిక్యులేషన్ తర్వాత, వస్తి అంబాలా కంటోన్మెంట్లోని ఆర్.బి. కళాశాలలో చేరారు. ఎఫ్.ఎ.లో విద్యార్థిగా ఉండగా, క్రీడలలో విశేషంగా రాణించారు. తెలివైన స్కౌట్గా పేరుపొందారు. వస్తి పంజాబ్లోని PWD లో హైడ్రోఎలక్ట్రిక్ శాఖలో ప్రభుత్వ సేవలో చేరారు. ఆయన అక్కడ 7 సంవత్సరాలు పనిచేశారు. కానీ సినిమాల పట్ల ఆసక్తితో, తన ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేశారు.
రాజా ఇనాయత్తులా, కె.బి. హకీమ్ అహ్మద్ షుజా ప్రభావంతో, వస్తి న్యూ ఓరియంట్ పిక్చర్స్ను సంప్రదించారు.
లాహోర్లోని న్యూ ఓరియంటల్ ఫిల్మ్స్తో వస్తి సినీ ప్రస్థానం మొదలైంది. అక్కడ ఆయన ‘ప్రేమ్యాత్ర’ (1937) సినిమాలో సహాయక పాత్రతో కెరీర్ ప్రారంభించారు, రెండు దశాబ్దాలుగా సాగిన కెరీర్లో తొలి అడుగు వేశారు.
వస్తి తన తొలి చిత్రాలలో కథానాయకుడిగా నటించి మంచి విజయాన్ని సాధించారు. క్యారెక్టర్ రోల్స్లో కూడా అంతే నైపుణ్యం ప్రదర్శించారు, లోతైన నటనతో, సూక్ష్మభేదాలను కూడా గ్రహించి ప్రేక్షకులను అబ్బురపరిచారు. తొలి రోజుల్లో నిరాలా హిందుస్థాన్ (1938), బాగ్బాన్ (1938), నర్తకి (1940), ఖైదీ (1940), కుర్మై (1941), ఆవాజ్ (1942) వంటి తదితర సినిమాలలో శోభనా సమర్థ్, ప్రేమ్ ఆదిబ్ వంటి ప్రసిద్ధుల సరసన నటించారు. నెలకి 85/- రూపాయల జీతంతో ప్రారంభించి, తరువాతి కాలంలో తన బ్యాంకు బాలన్స్ని వేల రూపాయలకు పెంచారు. తన విజయానికి అదృష్టం, శ్రమే కారణమన్నారు. మంచి క్రీడాకారుడు కావడంతో సమయం దొరికినప్పుడల్లా హాకీ, ఫుట్బాల్, క్రికెట్, ఇంకా రేసింగ్ ఆడేవారు.
మోహన్ మాన్షన్, విన్సెంట్ రోడ్, బాంద్రా, బొంబాయి – ఆ రోజుల్లో వారి శాశ్వత చిరునామాగా ఉండేది.
నూర్ మొహమ్మద్ చార్లీ మరియు మెహతాబ్లతో ‘సంజోగ్’ (1943), షమీతో ‘పెహ్లే ఆప్’ (1943), ‘దేవ్ కన్య’ (1946), ‘గుమాస్తా’, ‘రత్తన్’ (1944), ‘షామా’ (1946), ‘ఏక్ దిన్ కా సుల్తాన్’ (1945), ‘డాక్ బంగ్లా’ (1947); మనోరమతో ‘చునరియా’ (1948), ‘పుగ్రీ’ (1948), ‘లచ్చి’ (1949) వంటి చిత్రాలలో వస్తి నటన – ఆయనకి ప్రశంసలను, నమ్మకమైన అభిమానులను సంపాదించి పెట్టింది. హిందీ సినిమా స్వర్ణయుగంగా మారడానికి పునాది వేసిన సినిమాల్లో ఆయన ఒక భాగం.
వస్తి జీవితంపై విస్తృతమైన డాక్యుమెంటేషన్ లేనప్పటికీ, చిత్ర పరిశ్రమకు ఆయన చేసిన సేవ – ఆయన వదిలివెళ్ళిన సినిమాల ద్వారా స్పష్టంగా కనిపిస్తుంది. తరువాతి – పర్ఛాయియా (1952), లైలా మజ్ను (1953), షబాబ్ (1954), దునియా ఝుక్తీ హై (1960), గుడ్డి (1961), ససురాల్ (1961), ఫిర్ వోహీ దిల్ లాయా హూన్ (1963), దో బదన్ (1966), నూర్జెహాన్ (1967), శ్రీమాంజీ (1968), ప్యార్ కా మౌసం (1969), దీదార్ (1970), పతంగా (1971) వంటి చిత్రాలలో నటించారు.
నయా దునియా (1942) సినిమాలో “బూట్ కరూ మై పాలిష్ బాబూ” పాటలోనూ, పుగ్రీ (1948) సినిమాలో “ఏక్ తీర్ చలానే వాలే నే దిల్ లూట్ లియా” పాటలోనూ, పహేలే ఆప్ (1944) సినిమాలో శ్యామ్ కుమార్ పాడిన “బేఖబర్ జాగ్ జరా, కిస్ కీ ఔలాద్ హై తూ”, ఏక్ దిన్ కా సుల్తాన్ (1945) సినిమాలో జి.ఎం. దురానీ పాడిన “ఫలక్ కే చాంద్ కా హమ్నే జవాబ్ దేఖ్ లియా” పాటలోనూ, డోలి (1947) సినిమాలో “దిల్లీ కి గలియోం మే జియా నహీ లగే” అనే పాటలోనూ వస్తి కనిపించారు.
1930లు, 1940లు బాలీవుడ్లో మార్పుకి దారితీసిన సంవత్సరాలు, పరిశ్రమ కొత్త కథలను చెప్పే పద్ధతులతో ప్రయోగాలు చేసింది. వివిధ శైలులను అన్వేషించడంతో వస్తి వంటి నటులు ఈ కథలకు జీవం పోసి తమ నటనతో ప్రేక్షకులను కట్టిపడేయడంలోను, సినీ ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేయడంలో కీలక పాత్ర పోషించారు.
వస్తి ఏప్రిల్ 15, 1996న బొంబాయిలో మరణించారు.
పాకనాటి లక్ష్మీ ప్రియ, బాల్యం నుండే పాత సినిమాలు, సంగీతం పట్ల అభిరుచి కలిగి ఉన్నారు. చలన చిత్రాల విషయ సేకరణకర్త అయిన తన తండ్రిగారి నుండి ఎన్నో సంగతులు తెలుసుకున్నారు, నేర్చుకున్నారు. ఈ సంప్రదాయాన్ని ఆమె సోదరుడు కొనసాగిస్తున్నారు, వారి ఇల్లు సేకరణల నిధి. పుస్తక పఠనం పట్ల ఆసక్తిగల లక్ష్మీ ప్రియ నిత్య విద్యార్థిగా ఉండడానికి ఇష్టపడతారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి ఎం.ఎస్.సి జువాలజీలో బంగారు పతకం సాధించారు. అదే విశ్వవిద్యాలయం నుండి ఎంబిఎ చేశారు. ఒక బిజినెస్ స్కూల్లో మార్కెటింగ్ బోధించారు. సున్నితమైన ఆరోగ్యం కారణంగా ఉద్యోగాన్ని విడిచిపెట్టారు. ప్రస్తుతం – పాతకాలపు అభిమానుల ఆనందం కోసం, వారు పాత చిత్రాలు, పాటలు మరియు సమాచార పోస్ట్లను ఆస్వాదించేందుకు ఫేస్బుక్లో మ్యూజిక్ గ్రూప్స్ నిర్వహిస్తున్నారు.