Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

అలనాటి అపురూపాలు – 228

సినిమా, సంగీతం, కళలు, క్రీడలు – ఇలా ఏ రంగమైనా, అందులో విశేష ప్రతిభ కనబరిచిన అలనాటి కొందరు వ్యక్తుల గురించి, వారి జీవితంలోని కొన్ని విశిష్ట ఘటనల గురించి, ఉదాత్త ఆశయాలతో జరిగిన కొన్ని కార్యక్రమాల గురించి అరుదైన విషయాలను అపురూపమైన చిత్రాలతో ‘అలనాటి అపురూపాలు’ పేరిట సంచిక పాఠకులకు అందిస్తున్నారు లక్ష్మీ ప్రియ పాకనాటి.

~

సినిమాటోగ్రాఫర్, దర్శకుడు ఎ విన్సెంట్ (1928 – 2015):

జూన్ 14, 1928న కేరళలోని కోళికోడ్‌ (కాలికట్)లో జన్మించిన అలోసియస్ విన్సెంట్, 1950-2000 మధ్యకాలంలో సినిమాటోగ్రాఫర్‌గా, ఫిల్మ్ మేకర్‌గా పనిచేశారు. కెరీర్‌లో ఉచ్చస్థాయిలో ఉన్న కాలంలో – విన్సెంట్ తమిళం, తెలుగు, మలయాళ చిత్ర పరిశ్రమలలో అత్యంత డిమాండ్ ఉన్న సినిమాటోగ్రాఫర్. దక్షిణ భారత సినిమాని దాని మూలాధారమైన రంగస్థల రూపం నుండి వేరు చేసి, దానిని ఒక కళారూపంగా స్థాపించిన మార్గదర్శక కళాకారులలో ఆయన ఒకరు. నీలక్కుయిల్, అమరదీపం, నెంజమ్ మరిప్పతిల్లై, అన్నమయ్య వంటివి ఆయన కొన్ని ముఖ్యమైన చిత్రాలు. వారు తొలిసారిగా దర్శకత్వం వహించిన, ‘భార్గవి నిలయం’ (1964), ఒక సెమినల్ హారర్ డ్రామాగా పరిగణించబడుతుంది.

విన్సెంట్ మాస్టర్‌గా ప్రసిద్ధి చెందిన అలోసియస్ విన్సెంట్, కేరళలోని కోళికోడ్ పట్టణంలోని చిత్రా ఫోటో స్టూడియో యజమాని, ఉపాధ్యాయుడు, ఫోటోగ్రఫీ ఔత్సాహికుడు అయిన తన తండ్రి జార్జ్ విన్సెంట్ నుండి ఇమేజ్ మేకింగ్‌లో మొదటి పాఠాలను నేర్చుకున్నారు. బాల్యంలో, విన్సెంట్ తమ ఇంట్లో ఏర్పాటు చేసిన ఫోటోగ్రాఫిక్ డార్క్‌రూమ్‌లో చాలా గంటలు గడిపారు, దాని గాఢమైన ఎరుపు కాంతిలో మునిగితేలారు, ఫిల్మ్ నెగటివ్‌లను డెవలప్ చేయటం నేర్చుకున్నారు. అలా వారి జీవితం చిత్రాలతో ముడిపడి మొదలయింది.

అర్ధ శతాబ్దపు కెరీర్‌లో, విన్సెంట్ తెలుగు, మలయాళం, తమిళం, హిందీ భాషలలో 80 చిత్రాలకు పైగా సినిమాటోగ్రాఫర్‍గా వ్యవహరించారు, 30 చలన చిత్రాలకు దర్శకత్వం వహించారు. వీటిలో అనేక చిత్రాలు సాంకేతిక, సాంస్కృతిక మైలురాళ్లుగా భారతీయ సినిమా చరిత్రలో గుర్తించబడ్డాయి.

సహోద్యోగులు, కుటుంబ సభ్యులు విన్సెంట్ మాస్టర్‌ని మృదుస్వభావి అయిన కళాకారుడిగా, ఆర్టిస్టిక్ రిస్క్‌ తీసుకోవడానికి ఇష్టపడే గొప్ప పాఠకుడిగా అభివర్ణించారు. స్వతంత్ర సినిమాటోగ్రాఫర్‌గా తన మొదటి మలయాళ చలనచిత్రం ‘నీలక్కుయిల్’ (1954)లోని ‘ఎంగనే నీ మరక్కుమ” అనే పాట సీక్వెన్స్‌లో ఒక షాట్ కోసం, అవుట్‌డోర్ క్రేన్ షాట్‌ను తొలగించి – ఎడ్ల బండిపై నిర్మించిన ప్లాట్‌ఫారమ్‌పై కెమెరాను ఉంచి తీశారు. ఇలా చేయడం మలయాళ సినీ చరిత్రలో తొలిసారి. మలయాళంలో మొట్టమొదటి సోషల్-రియలిస్ట్ మెలోడ్రామా అయిన నీలక్కుయిల్, పాక్షికంగా అయినా, అవుట్‌డోర్ లొకేషన్‌లలో చిత్రీకరించబడిన మొదటి మలయాళ చిత్రాలలో ఒకటి. స్టూడియో సెట్స్ నుండి బయటకు వచ్చి – విస్తారమైన సహజ సుందర ప్రదేశాలలో చిత్రీకరణ చేయడం అప్పట్లో నిజంగా ఓ పెద్ద ముందడుగే. సన్నివేశాలలోని దృశ్యాలు అద్భుతంగా వచ్చాయి; మలయాళ సినిమాలలో అప్పటికి ప్రబలంగా ఉన్న ఫ్లాట్ లైటింగ్, స్టాటిక్ కెమెరా కదలికల నుండి సమూలంగా మారాయి.

సినిమాటోగ్రాఫర్‌గా విన్సెంట్ కెరీర్ 1947లో 19 ఏళ్ల వయసులో మద్రాసులోని జెమినీ స్టూడియోలో ప్రారంభమైంది. ప్రఖ్యాత స్టూడియోలో గడిపిన నాలుగు సంవత్సరాలలో, చంద్రలేఖ (1948), అపూర్వసాగోదారంగల్ (1949) వంటి గొప్ప చిత్రాలలో ఎ నటరాజన్, కమల్ ఘోష్‌లకు అసిస్టెంట్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేశారు. తెలుగు సినిమా బహుముఖ ప్రజ్ఞాశాలి పి.భానుమతి భరణి స్టూడియోస్‌ను స్థాపించినప్పుడు, విన్సెంట్ కమల్ ఘోష్‌కి అసిస్టెంట్ కెమెరామెన్‌గా స్టూడియోలో చేరారు. 1953లో, భరణి స్టూడియోస్ సహ వ్యవస్థాపకుడు టి రామకృష్ణారావు దర్శకత్వం వహించిన ‘బ్రతుకు తెరువు’ ద్వారా స్వతంత్ర సినిమాటోగ్రాఫర్‌గా అరంగేట్రం చేశారు. దాదాపు అదే సమయంలో, భారతీయ సినిమాటోగ్రఫీ గమనాన్ని మార్చాలనుకున్న ఇద్దరు యువకులు – కలకత్తాలో ‘పథేర్ పాంచాలి’ (1952)తో సుబ్రొతో మిత్ర; బొంబాయిలో ‘జాల్’ (1952) తో వి.కె. మూర్తి కూడా తమ అరంగేట్రం చేశారు.

తెలివైన, విశ్వసనీయుడైన సాంకేతిక నిపుణుడు, కళాత్మక ప్రవృత్తి సహజంగా అబ్బిన విన్సెంట్, దక్షిణ భారత చలనచిత్రంలో అత్యంత బిజీగా ఉండే సినిమాటోగ్రాఫర్‌లలో ఒకరిగా పేరు తెచ్చుకున్నారు. ప్రేక్షకులను సినిమా హాళ్లకు ఆకర్షించే రొమాంటిక్ వాతావరణాన్ని సృష్టించడం; పాత-శైలి అందాలని సృష్టించడంలో ప్రావీణ్యం ద్వారా విన్సెంట్ ప్రత్యేకంగా ప్రసిద్ది చెందారు. “తెలుగు, తమిళ సినిమాలలో తన బిజీ షెడ్యూల్‌ల మధ్య, నాన్న – వీలు చేసుకుని – కేరళలోని ప్రఖ్యాత ఉదయ స్టూడియోస్‌లో భారీ బడ్జెట్ ఎపిక్ డ్రామాలలో పాటలు, యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించేవారు” అని వారి చిన్న కుమారుడు, సినిమాటోగ్రాఫర్ అజయన్ విన్సెంట్ చెప్పారు.

విన్సెంట్ లైటింగ్, కంపోజిషన్‍ల సాధారణ నియమాలను పాటించలేదు కానీ వాస్తవికతను – వాతావరణాన్ని ఉన్నతీకరించే అందమైన చిత్రాలుగా తీర్చిదిద్దారు. ఈ పద్ధతిలో, ఆయన ప్రేక్షకులకు అద్భుతమైన దీపస్తంభాలను అందించారు, వారి వీక్షణ అనుభవాన్ని మెరుగుపరిచారు. ‘గంధర్వ క్షేత్రం’ (1972) అనే సైకో-హారర్ డ్రామాలో, ఆయన ఇంద్రజాలాన్ని అద్భుతంగా ప్రదర్శించారు. ఓపెనింగ్ సాంగ్‌లో, ఒక చిన్న పాప ఒక చెట్టు మీదున్న ఒక యక్షిణిని కలవడాన్ని చూపిస్తారు, అతిగా ఎక్స్‌పోజ్ చేయబడిన డచ్ యాంగిల్ షాట్ ద్వారా యక్షిణి కనబడతుంది. ‘గాంధర్వ క్షేత్రం’ యొక్క దృశ్యమాన శైలి ఆ చిత్ర కథానాయిక లక్ష్మి (శారద) సంక్లిష్ట మనస్తత్వానికి పొడిగింపులా గోచరిస్తుంది. ఎం.టి. వాసుదేవన్ నాయర్ స్క్రీన్‌ప్లే ఆధారంగా, తాను దర్శకత్వం వహించిన ‘నిళలాట్టం’ (1970) సినిమాలో, విన్సెంట్ – తన సంపదనంతా పోగొట్టుకున్న కథానాయకుడు తన ఇంటిని బలవంతంగా వదిలి వెళ్ళే సన్నివేశంలో ఒక ప్రత్యేక విజువల్ ఎఫెక్ట్‌ను రూపొందించారు. మనిషి దుస్థితిని వీక్షకుడు సులువుగా గ్రహించేలా ఆ దృశ్యంలోని చిత్రాన్ని ఆయన తలక్రిందులుగా చూపించారు.

“నాన్న ఫ్లాట్ సాఫ్ట్ లైటింగ్ కంటే డైరెక్షనల్ లైటింగ్, కొద్దిగా కాంట్రాస్ట్ ఇమేజ్‍లను ఇష్టపడేవారు,” అని ఒక దశాబ్దం పాటు తండ్రికి సహాయకుడిగా ఉన్న ఆయన పెద్ద కొడుకు, సినిమాటోగ్రాఫర్ జయనన్ చెప్పారు. “అయితే, ఫాల్‌ఆఫ్‌ను మృదువుగా చేయడానికి తెల్లటి గాజుగుడ్డని, తెల్లటి దోమల తెరలతో ప్రకాశించే టంగ్‌స్టన్ కీ లైట్లను, ఇంకా నీడలేని సాఫ్ట్ ఫిల్ లైట్‌ను సాధించడానికి మోల్ రిచర్డ్‌సన్ గ్రౌండ్ గ్లాస్ ప్యానెల్‌లతో ‘డబుల్ బ్రాడ్ లైట్లను’ విస్తరించారు. వైడ్ యాంగిల్ చిత్రీకరణ సమయంలో పెద్ద ప్రాంతాలలో కాంతిని నింపడానికి కొన్ని సమయాల్లో, నాన్న ఉదారంగా ఓపెన్ ఫేస్ మోల్ రిచర్డ్‌సన్ ‘రైఫిల్’ని ఉపయోగించారు” తెలిపారు జయనన్.

“ఒక సాధారణ 3-పాయింట్ లైటింగ్ టెక్నిక్, 3/4 ఫ్రంటల్ కీ లైట్, ఫ్లాట్ ఫిల్ లైట్ మరియు హై బ్యాక్‌లైట్‌ని ఉపయోగించడం ద్వారా ప్రారంభించారు, అయితే – కీ ఎదురు దిశలో కట్ లైట్‌ని ఉంచి డైరెక్షనల్ హాఫ్-లైట్‍ని, ముఖాలపై వచ్చేలా చేశారు. ఇది ఒక రకమైన 5-పాయింట్ లైటింగ్‌గా మారుతుంది” అని జయనన్ వివరించాడు. “అదనపు సగం కాంతిని ఉపయోగించడం వారి సహోద్యోగుల, శిష్యులలో ఆశ్చర్యం కలిగించింది. అయినప్పటికీ, దినపత్రికలలో లేదా రష్‌లలో చూసినప్పుడు, ఆ రోజే తెలిసినట్లుగా, అదనపు సగం కాంతి సృష్టించిన దృశ్యమాన మెరుగుదలని వారు గ్రహించారు. వారు దానికి ‘ది విన్సెంట్ స్కూల్ ఆఫ్ లైటింగ్’ అని పేరు పెట్టారు, దీనివల్ల నెగటివ్ కొంచెం ఎక్కువగా ఎక్స్‌పోజ్ అవుతుంది, ఫలితంగా బ్లాక్ అండ్ వైట్ లలో నలుపు బాగా కనిపించేది.”

టి ప్రకాశరావు దర్శకత్వం వహించిన ‘ఉత్తమ పుతిరన్’ (1958), విన్సెంట్ గారి కళాత్మకతకు, ఉపజ్ఞతకు అద్భుతమైన సాక్ష్యం. మైసూర్‌లోని బృందావన్ గార్డెన్‌లో షూటింగ్ చేస్తున్నప్పుడు, ఒక ప్రత్యేకమైన షాట్-కంపోజిషన్ విన్సెంట్‌ గారి తెలివితేటలను ప్రదర్శించింది. కథానాయిక, అముతవల్లి (పద్మిని) తన మనస్సులో ఒక తెలివైన ప్రణాళికను రూపొందిస్తుంది, ఆమె తన భవనం పై అంతస్తులోని తన గదిలో ఉండగా, విరోధి విక్రమన్ (శివాజీ గణేశన్) తోటలో ఉన్నారు. నటీనటులిద్దరిలో – ఒకరిని చిన్న చుక్కలా కనిపించకుండా – వైడ్ ఫ్రేమ్‌లో అమర్చడం అసాధ్యం. మాగ్నిఫికేషన్, ఇంకా పర్‍స్పెక్టివ్‍లకు సంబంధించిన ఈ సమస్యను జూమ్ లెన్స్ ఉపయోగించి సులభంగా పరిష్కరించవచ్చు. దురదృష్టవశాత్తు, ఆ సమయంలో అది భారతదేశంలో అందుబాటులో లేదు. వేరిఫోకల్ లెన్స్‌తో కూడిన పైలార్డ్ బోలెక్స్ 16 మిమీ కెమెరాను పట్టుకుని గార్డెన్‌లో తిరుగుతున్న ఫ్రెంచ్ పర్యాటకుడు విన్సెంట్ దృష్టిలో పడ్డాడు. ఆ పర్యాటకుడి నుండి కెమెరాను అరువుగా తీసుకొని 16mm లో పాటను చిత్రీకరించారు విన్సెంట్. తరువాత, ఎక్స్‌పోజ్ చేయబడిన ఫిల్మ్ ఫుటేజీని లండన్‌లోని కోడాక్ ప్రాసెసింగ్ ల్యాబ్‌కు పంపారు, అక్కడ దాన్ని 35 మిమీ వరకు పెంచారు. “లండన్ ల్యాబ్‌లోని సాంకేతిక నిపుణులు ఇంత మంచి బ్లో-అప్ ఫలితాలను చూసి ఆశ్చర్యపోయారు, ఆ షాట్‌ని ఎలా తీశానని నన్ను అడిగారు” అని విన్సెంట్ తరువాత ది హిందూకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.

‘ఉత్తమ పుతిరన్’ మరొక కారణంలో కూడా ఓ గొప్ప పురోగామి సినిమా. అలెగ్జాండ్రే డుమాస్ రచించిన ‘ది మ్యాన్ ఇన్ ది ఐరన్ మాస్క్’ ఆధారంగా రూపొందించిన ఈ కాస్ట్యూమ్ డ్రామాలో, పుట్టుకతోనే విడిపోయిన కవల సోదరులుగా శివాజీ గణేశన్ రెండు పాత్రలను పోషించారు. ‘కోర్సికన్ బ్రదర్స్’ అనుసరణగా, జెమినీ స్టూడియో వారు తీసిన ‘అపూర్వసాగోదారంగల్’ (1949) సినిమాకి, విన్సెంట్ – కమల్ ఘోష్‌కి సహాయకుడిగా స్పెషల్ ఎఫెక్ట్స్ డిపార్ట్‌మెంట్‌తో కలిసి పనిచేశారు. ఈ సినిమాలో ఎం.కె. రాధ ద్విపాత్రాభినయం చేశారు. విన్సెంట్ ‘ఉత్తమ పుతిరన్‌’లో తన అభ్యాసాన్ని మెరుగుపరచుకోవాలనుకున్నారు. ద్విపాత్రల సన్నివేశాలను చిత్రీకరించడానికి అప్పట్లో విస్తృతంగా వాడుతున్న స్టాటిక్ మాట్ పద్ధతికి బదులుగా, విన్సెంట్ – షాడో మాస్క్ – అనే కొత్త లైటింగ్ టెక్నిక్‌ని ఉపయోగించారు. ఫ్రేమ్‌లో నటుల కదలికను పరిమితం చేసే పాత పద్ధతితో పోలిస్తే ఇది గొప్ప మెరుగుదల. ‘ఉత్తమ పుతిరన్‌’లో, భారతీయ సినిమాలో మొదటిసారిగా, ప్రేక్షకులు ఒకే నటుడు పోషించిన రెండు పాత్రలు – ఒకదానికొకటి దాటడం – ఫ్రేమ్‌లో చూశారు.

సినిమాటోగ్రాఫర్‌గా – నటీనటులు, చిత్రనిర్మాతలు, తోటి సాంకేతిక నిపుణులతో సుదీర్ఘమైన, ఫలవంతమైన వృత్తిపరమైన సంబంధాలను కలిగి ఉన్నారు విన్సెంట్. తమిళ చిత్రనిర్మాత సి.వి.శ్రీధర్‌తో అతని అనుబంధం ‘అమర దీపం’ (1954), ‘కళ్యాణ పరిసు’ (1959) వంటి పెద్ద కమర్షియల్ హిట్‌లకు దారితీసింది. ఆ విజయాలతో ఊపందుకున్న విన్సెంట్, శ్రీధర్ – వారి స్నేహితులు ఫోటోగ్రాఫర్ తిరుచ్చి అరుణాచలం, రచయిత-నటుడు గోపుతో కలిసి ‘చిత్రాలయ’ అనే నిర్మాణ సంస్థను స్థాపించారు. ఇది ‘కాదలిక్క నేరమిల్లై’ (1964), ‘నెంజిల్ ఒరు ఆలయం’ వంటి ప్రశంసలు పొందిన చిత్రాలను నిర్మించింది. ఈ చిత్రాలు హిందీలో నజరానా (1961), దిల్ ఏక్ మందిర్ (1963)గా పునర్నిర్మించబడినప్పుడు, వీటికి శ్రీధర్ దర్శకుడిగా, విన్సెంట్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేశారు.

విన్సెంట్  మొదటి కలర్ వెంచర్, ‘కాదలిక్క నేరమిల్లై’ ఈస్ట్‌మన్ కలర్‌లో చిత్రీకరించబడిన మొదటి తమిళ చిత్రం. బ్లాక్ అండ్ వైట్ మీడియంలా, కలర్ మీడియం క్లిష్టంగా లేదని ఆయన అన్నారు. “ఫ్రేమ్ కనిపించేలా చేయడం చాలా సులభం, కానీ ఫ్రేమ్‌ను ఆకట్టుకునేలా చేయడం కష్టం. ముఖ్యంగా బ్లాక్ అండ్ వైట్ మీడియంలో సాంకేతిక నైపుణ్యం చాలా అవసరం” అని సి.కె. మురళీధరన్ ISC గారికి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చెప్పారు విన్సెంట్. కలర్ ఫిల్మ్‌లలో కూడా అద్భుతమైన సినిమాలు చేశారు విన్సెంట్. కె. రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన తెలుగు ఫాంటసీ-రొమాంటిక్ డ్రామా, ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ (1990)లో విన్సెంట్ సినిమాటోగ్రఫీ అద్భుతమనే చెప్పాలి. ఈ సినిమాలో శ్రీదేవి భూమికి దిగివచ్చిన దేవకన్యగా నటించారు, ‘అందాలలో ఆహా మహోదయం’ అనే పాటను విన్సెంట్ శాట్యురేటెడ్ కలర్స్‌లో, డిఫ్యూజ్డ్ లైటింగ్‌లో చిత్రీకరించి, వెండితెరపై సజీవంగా నిలిపారు.

విన్సెంట్ SICA (సౌత్ ఇండియన్ సినిమాటోగ్రాఫర్స్ అసోసియేషన్) యొక్క వ్యవస్థాపక అధ్యక్షుడు. ఇది 1972లో స్థాపించబడిన ఒక ట్రేడ్ యూనియన్. దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమలలో సినిమాటోగ్రఫీ రంగంలో పనిచేస్తున్న వారి హక్కుల కోసం పోరాడటానికి స్థాపించబడింది. విన్సెంట్ – పిఎన్ సుందరం, భాస్కర్ రావు వంటి అనేక మంది యువ సినిమాటోగ్రాఫర్‌లకు మార్గదర్శనం చేశారు.

“సినిమాటోగ్రఫీ కళని రహస్యంగా ఉంచిన రోజుల్లో, చాలా మంది అసిస్టెంట్ సినిమాటోగ్రాఫర్‌లు తమ సీనియర్ సినిమాటోగ్రాఫర్‌లను పనిలో గమనించడం ద్వారా కళను నేర్చుకోవాల్సి వచ్చేది. కానీ విన్సెంట్ – లైటింగ్, కంపోజిషన్, సినిమా లక్షణాలలోని చిక్కుల గురించి తనకున్న లోతైన పరిజ్ఞానాన్ని తన శిష్యులతో పంచుకున్నారు. వినూత్నంగా, సాహసోపేతంగా ప్రయోగాలు చేసేలా వారిని ప్రోత్సహించారు” అని జయనన్ చెప్పారు. “నాన్న చిత్రకారుడు కూడా కావటంతో – ఫ్రేమ్‌ని చిత్రించి, హైలైట్‌లు, షాడోలతో ప్రయోగాలు చేశారు. తన శిష్యులలో చిన్నవారు కూడా ఈ భావనను అర్థం చేసుకునేంత సాంకేతిక పరిభాషను సరళీకృతం చేశారు. తన శిష్యులు స్వతంత్ర సినిమాటోగ్రాఫర్‌లుగా మారిన తర్వాత కూడా వారికి మద్దతు ఇచ్చారు. ఆయన వారి సినిమాల కోసం పాటలు లేదా సన్నివేశాలను చిత్రీకరించారు, ట్రిక్ ఫోటోగ్రఫీకి సాంకేతిక సహాయం చేశారు, శ్రేష్ఠతను సాధించడానికి నైతిక మద్దతు అందించారు” చెప్పారు జయనన్.

దర్శకుడిగా విన్సెంట్:

దృశ్యానికి ప్రాధాన్యతనిచ్చే, విన్సెంట్ కెరీర్ సినిమాటోగ్రఫీ నుండి ఫిల్మ్ మేకింగ్‌కి మారడం సహజమైన పురోగతి. MACTA 24 ఫ్రేమ్‌ల అధికారిక మ్యాగజైన్‌లో విన్సెంట్‌కు నివాళులర్పిస్తూ, లైట్స్, కెమెరా పరిధిని అధిగమించి సెట్‍లో ఆర్టిస్టుల పనితీరు, ప్రొడక్షన్ డిజైన్‌ను చక్కగా ఉండేలా చూసుకున్న ఒక పరిపూర్ణతావాదిగా మాస్టర్‌ని అభివర్ణించారు నటుడు మధు.

‘భార్గవి నిలయం’ (1964), విన్సెంట్ దర్శకత్వం వహించిన తొలి చిత్రం, మలయాళ సినిమాలను ఓ ప్రభంజనంలా ముంచెత్తిన ఈ హారర్ డ్రామాలోని ప్రధాన నటుల్లో మధు ఒకరు. ‘భార్గవి నిలయం’ అసాధారణమైన దెయ్యం కథ, ఇందులో ప్రేమ కథలోనే భయానక రసాన్ని మేళవించారు. ప్రఖ్యాత రచయిత వైకోమ్ ముహమ్మద్ బషీర్ – విన్సెంట్‌తో సంప్రదించి తన నవల ‘నీలవెలిచం’ ఆధారంగా ఈ సినిమా స్క్రీన్‌ప్లేను వ్రాశారు. వారి గొప్ప సాహిత్యానికి విన్సెంట్ సాంకేతిక సొబగులద్దారు. విన్సెంట్‌కి చిరకాల సహచరుడు భాస్కర్‌రావు ఈ సినిమాతో సినిమాటోగ్రాఫర్‌గా అరంగేట్రం చేశారు.

మలయాళంలో, ప్రఖ్యాత రచయిత ఎం.టి. వాసుదేవన్ నాయర్‌తో కలిసి విన్సెంట్ చాలాసార్లు పనిచేశారు. విమర్శకుల ప్రశంసలు, వాణిజ్యపరంగా విజయవంతమైన చిత్రాలను తీశారు. వారి సినిమాలు, మెలోడ్రామా, రియలిజం మధ్య సన్నని గీతపై నడిచాయి, మెలోడ్రామాను వీడి వాస్తవికత వైపు మొగ్గు చూపడంతో, రాష్ట్రంలోని భావి చిత్రనిర్మాతలకు – భయం లేని కొత్త మార్గాన్ని రూపొందించాయి. ‘మురపెన్ను’ (1965) వాసుదేవనన్ తొలి స్క్రీన్ రైటింగ్, దర్శకుడిగా విన్సెంట్‌కి రెండవ చిత్రం. ఈ చిత్రం కేరళలోని భూస్వామ్య విధానం పతనమవడాన్ని, హిందూ ఉమ్మడి కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నం కావడాన్ని ప్రదర్శించింది. అప్పటి సూపర్ స్టార్ ప్రేమ్ నజీర్, అల్లకల్లోలమైన సమయంలో ఒడిదుడుకులు ఎదుర్కున్న వ్యక్తిలా ప్రధాన పాత్రను పోషించారు. ఎన్‌సైక్లోపీడియా ఆఫ్ ఇండియన్ సినిమా ‘మురపెన్ను’ సినిమాని MT వాసుదేవన్ నాయర్ గారి పొలిటికల్ మెలోడ్రామా త్రయంలో మొదటిదిగా పేర్కొంది.

ప్రముఖ నాటక రచయిత, చిత్రకారుడు తొప్పిల్ భాసి, విన్సెంట్ మొదటిసారిగా 1968లో పెట్టుబడిదారీ వ్యతిరేక చిత్రం ‘తులాభారం’ కోసం చేతులు కలిపారు. ఈ చిత్రం రెండవ ఉత్తమ చలన చిత్రంగా జాతీయ అవార్డును గెలుచుకుంది. ఒక దశాబ్దం పాటు కొనసాగిన భాగస్వామ్యంలో, భాసి – విన్సెంట్ కేరళ రాజకీయ రంగస్థలంపై దృఢమైన సైద్ధాంతిక నిబద్ధతను కలిగి ఉన్న చలనచిత్రాలను నిర్మించారు, తమ సిద్ధాంతాలను ఉద్వేగభరితమైన కథన నిర్మాణంతో కలిపారు. ‘తులాభారం’, నాటకీయత కలిగి ఉన్నప్పటికీ, ఒక ప్రత్యేక దృశ్య శైలిని కలిగి ఉంది. ప్రారంభ సన్నివేశంలో, విచారణ జరుగుతున్న కోర్టు హాలులో, ఈ సినిమా శారదను అతి తక్కువ నాటకీయమైన హావభావాల ద్వారా పరిచయం చేస్తుంది. గోడపై ఆమె నీడ – లాయర్ల కన్నా, జజ్డ్ కన్నా పెద్దదిగా ఉంటుంది. కోర్టు బోను హ్యాండ్‌రైల్‌పై ఆమె వణుకుతున్న చేతిని చూపించే షాట్‌ని కెమెరా అద్భుతంగా చూపిస్తుంది. ఈ చిత్రంలోని నటనకు శారదకు ఉత్తమ నటిగా జాతీయ అవార్డు లభించింది. విన్సెంట్, తన జీవిత చరమాంకంలో రికార్డ్ చేసిన ఒక వీడియో ఇంటర్వ్యూలో, శారద తాను ఇప్పటివరకు పనిచేసిన అత్యుత్తమ నటీమణి అని చెప్పారు.

విన్సెంట్ తన జీవితమంతా కథలని, చిత్రాలను వెంబడించారు. చిత్ర నిర్మాణంలో సాంకేతిక పరిణామాలపై అంతులేని ఆసక్తిని కనబరిచారు. 60 ఏళ్ళ వయసులో, ఆయన ‘పౌర్ణమి రావిల్’ (1985) సినిమాకి దర్శకత్వం వహించారు, ఇది మలయాళంలో రెండవ 3D చిత్రం. బహుభాషా తారాగణంతో కూడిన ఫాంటసీ డ్రామా.

తన కుమారుడు అజయన్ ఓ అత్యవసరం పని వల్ల, తాను పని చేస్తున్న ‘అధర్వం’ (1989) సినిమా షూటింగ్‍కి వెళ్ళలేకపోతే, అజయన్‌కు స్టాండ్‌బై సినిమాటోగ్రాఫర్‌గా విన్సెంట్ – పిలవకుండానే సెట్‌కి వచ్చి పనిచేశారని, సీనరిస్ట్-ఫిల్మ్ మేకర్ డెన్నిస్ జోసెఫ్ తెలిపారు. తరువాతి నాలుగు రోజుల్లో, అనుభవజ్ఞుడైన ఆ సినిమాటోగ్రాఫర్ తన కంటే వయసులో చాలా చిన్నవాళ్ళయిన సిబ్బందితో శ్రద్ధగా పనిచేసి, వారిని ఆశ్చర్యపరిచారు. తన జీవితాన్ని సినిమాకే అంకితం చేసిన విన్సెంట్, రసజ్ఞులను ఆకట్టుకునే గొప్ప కృషిని వదిలిపెట్టి వెళ్ళారు.

Exit mobile version