శబ్దం నిశ్శబ్దాల మధ్యనున్న
సన్నటి దారమే జీవితం.
ఉమ్మనీటిని విదుల్చుకొని కెవ్వు మన్నావానాడు.
కర్మ బంధాల్ని విదుల్చుకొని
ఆఖరి శ్వాస విడుస్తావీ నాడు.
ఈ మధ్య కాలంలోనే అనుబంధాల చట్రంలో
ఇరుక్కొని ఆత్మీయ లతలు పెనవేసుకుంటుంటే
ఒక బలీయమైన నిట్టూర్పుతో
ఎటు పోతున్నామో తెలియని అగమ్య గమనంలో
జీవిత నౌకను నడిపిస్తావు.
ప్రస్థాన గోచరం గాని స్థితిలో తిరుగాడుతూ
చీకటి వెలుగుల దోబూచులాట ఊబిలో
తేజో విహీన నిస్తేజ రూపాన్ని అద్దుకొని
అర్థంలేని వెంపర్లాటల వెంటబడి
పడుతూ లేస్తూ చీకటి ప్రయాణాన్ని చేస్తుంటావు.
ఓ మనిషీ….!
ఏ పరమార్ధం కోసమీ ప్రస్థానం..?
ఏ వెలుగుల కోసం ఈ ఆరాటం…?
ఖర్చయిన జీవితమెంతో లెక్కలేసి, హెచ్చ వేసి
తీసివేతలతో కూడుకొని చూడు..
కవి, రచయిత, నాటక, రేడియో రచయితగా ప్రసిద్ధులైన శ్రీ ఆవుల వెంకట రమణ 1999 నుంచీ కథలూ, కవితలు వ్రాస్తున్నారు. వీరి కథలూ, కవితలూ వివిధ పత్రికల్లో అచ్చాయ్యాయి. ఆకాశవాణి విజయవాడ, హైదరాబాదు, మార్కాపురం కేంద్రాల్లో వీరు రచించిన అనేక కథలు, కవితలూ, నాటకాలు అనేక మార్లు ప్రసారమయ్యాయి. దిశా నిర్దేశం – కవితా సంపుటి, అల రక్కసి – దీర్ఘ కవిత, భారత సింహం నాటకం ప్రచురించారు. అనేక సాహిత్య సంస్థల నుంచి సన్మానాలని స్వీకరించారు.
సహజకవి, సాహితీ ఆణిముత్యం, సాహిత్య రత్న, మత్స్యకవిమిత్ర బిరుదుల్ని పొందారు. హ్యుమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వారి ఉగాది పురస్కారాన్ని (02-04-2022) పొందారు. 2020లో ప్రజాశాక్తి దినపత్రిక ఆదివారం ప్రత్యేకం స్నేహలో సంవత్సరం పాటు ప్రచురింపబడిన మత్స్యకార కథలని ‘కరవాక కథలు’ పేరుతో సంపుటంగా తీసుకురాబోతున్నారు. కొన్ని వందల యేండ్ల క్రితం తమిళనాడు ప్రాంతం నుంచి వలస వచ్చి ప్రస్తుతం తిరుపతి, నెల్లూరు, ప్రకాశం, బాపట్ల జిల్లాల సముద్ర తీరంలో నివసిస్తున్న పట్టపు మత్స్యకారుల మీద చేసిన పరిశోధనా గ్రంథాన్ని అతి త్వరలో ముద్రించబోతున్నారు. కుసుమ వేదన కావ్యాన్ని ఎక్కడా శిక్షణ తీసుకోకుండా స్వయం కృషితో ఛందోబద్ధ పద్యకావ్యంగా రచించారు.
కం॥
గురువెవ్వరు నా కవితకు
గురువెవ్వరు లేరు నాకు గురుతులు దెలుపన్
గురువులు లేకనె నేనిట
ధరణిని శారద కరుణను దయగొని బడితిన్.