Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

ఆదాబ్ హైదరాబాద్..-5

[హైదరాబాద్‌ను పూర్తి స్థాయిలో తెలుసుకోవాలనే కోరికతో నగరంలో ప్రయాణించి పి. జ్యోతి గారు అందిస్తున్న ఫీచర్ ‘ఆదాబ్ హైదరాబాద్’.]

బిరియానీ – ఇరానీ టీ-2

కేఫ్ బహార్ బషీర్ బాగ్

ఇరానీ చాయ్ ప్రత్యేకత ఏంటంటే పాలను, డికాషన్‍ను కలిపి మరిగించరు. దీన్ని చేయడానికి చాలా సమయం పడుతుంది. డికాషన్‌ని విడిగా తయారు చేసి, భాప్ని (కంటైనర్) లో పోస్తారు, మరో పక్క పాలు తక్కువ మంటపై గంటల తరబడి మరిగిస్తారు. టీ కావాలన్నవారికి ముందుగా కప్పులో మరిగించిన ఆ పాలను పోసి తరువాత టీ డికాషన్ పోసి తయారు చేస్తారు. దీన్ని తెల్ల కప్పు సాసర్లలోనే అందిస్తారు. ఇరానీ హోటళ్లన్నిటిలోనూ ఈ చాయ్ దొరుకుతుంది. బిరియానీ తిన్న తరువాత కూడా ఇరానీ చాయ్ తాగడానికి ఇష్టపడే వాళ్లు హైదరాబాద్‌లో ఎక్కువ కనిపిస్తారు. కేవలం టీ మాత్రమే ఇచ్చే ఇరానీ కెఫేలు ఒకప్పుడు నగరం నిండా ఉండేవి. ఈ టీని ఉస్మానియా బిస్కెట్లు, లుఖ్మి, టై బిస్కట్లు, కొన్ని సార్లు తియ్యటి క్రీం తో కూడా తాగడానికి ఇష్టపడతారు హైదరాబాదీలు.

కేఫ్ బహార్ లో ఇరానీ టీ తయారీ

అసలు ఇరాన్‌లో టీ పాలతో కలిపి తయారు చేయరు. బ్లాక్ టీ చేసి ఓ చక్కెర గడ్డను నోట్లో పెట్టుకుని ఆ ద్రవాన్ని మెల్లమెల్లగా చప్పరిస్తారు. కాని భారతదేశంలోని పద్ధతులను అనుసరించి ఇరానీలు ఇక్కడ వారి కోసం పాలను కలిపి టీని తయారు చేసారు. ఇరానీ హోటల్ లలో దొరుకుతుంది కాబట్టి దాన్ని ఇరానీ ఛాయ్ అంటారు కాని ఇరాన్‌లో ఇలాంటి టీ ఎవరూ తాగరు.  హైదరాబాద్‍లో ఈ ఇరానీ చాయ్ పదిహేను రూపాయల నుండి ఐదువందల రూపాయిల దాకా దొరుకుతుంది. అంటే వెళ్ళే హోటల్ బట్టి రేటు మారుతుంది. సాధారణ హోటల్లలో పదిహేను నుండి ఇరవై రూపాయలలో ఇరానీ టీని ఆస్వాదించవచ్చు. నిజం చెప్పాలంటే ఎక్కడకి వెళ్ళినా ఆ టీ రుచి అదే. ఈ టీ తో హైదరాబాదీలు ఇష్టపడే ఆహారం బన్ మస్కా. బషీర్ బాగ్ లోని కేఫ్ బహార్ హోటల్ ముందు నుంచుంటే అక్కడ ఇరానీ టీ ఔట్లెట్‌లో బన్ మస్కా, టీ తాగి వెళ్ళేవాళ్లలో యువకులు అధికంగా ఉండడం ఆశ్చర్యపరిచింది. పాత హైదరాబాదీ తరం ఇష్టపడే ఈ రుచి ఇప్పటి తరాన్ని కూడా అలరించడం ఆనందింపజేసింది. మస్కా అంటే బటర్ క్రీమ్‌ల కలయిక. బన్‌ను అడ్డంగా రెండు భాగాలుగా కోసి, కొద్దిగా వేడి చేసి ఒకదానిపై క్రీమ్ మరో దానిపై బటర్ పెట్టి కొంత చక్కెర చల్లి కలిపి వడ్డిస్తారు. అది బన్ మస్కా. దీని కోసం వాడే బన్ కూడా మామూలు పావ్ కన్నా తీయగా ఉంటుంది. దీన్ని ఇరానీ టీ తో తింటే ఆ మజా వేరు.

ఇరానీ చాయ్ బన్ మస్కా

కేఫ్ బహార్‌లో బేకరీ కౌంటర్

అయితే ఈ బన్ మస్కా పార్సీల వంటకం. ముంబయ్‌లో ఇరానీ హోటళ్లను మొదలుపెట్టిన ఇరానీలకు ఆ నగరానికి తమ లాగే వలస వచ్చిన పార్సీల స్నేహం దొరికింది. వారి దగ్గర ఈ వంటకాన్ని పట్టుకుని తాము ప్రత్యేకంగా రూపొందించిన ఇరానీ చాయ్‌తో కలిపి వడ్డించడం మొదలెట్టారు. ముంబయ్ నగరవాసులు ఈ బన్ మస్కాలను ఎంతో ఇష్టంగా తింటారు. ముంబయ్ తరువాత పూనా, ఆ తరువాత హైదరాబాద్ వచ్చిన ఇరానీ హోటళ్ల సంస్కృతి మన హైదరాబాద్‌కూ బన్ మస్కాను పరిచయం చేసింది. ఇది హైదరాబాద్ సంప్రదాయంలో ఓ భాగం అయిపోయింది.

హైదరాబాద్‌లో బషీర్‌బాగ్ ఏరియాలో ఉంటుంది కఫే బహార్. ఇది 1973 లో ప్రారంభమయింది. సయ్యద్ హుసైన్ బులూకి, దీన్ని మొదట చిన్న చాయ్ హోటల్‌గా ప్రారంభించారు. ఆ పరిసరాలలో ఈ హోటల్ ఓ లాండ్‌మార్క్‌గా  నిలిచింది. తరువాత విసరిస్తూ బిరియానీ హలీం లను హైదరాబాదీయులకు పరిచయం చేస్తూ ఇప్పుడు 250 మంది పనివాళ్ళతో హైదరాబాద్‌లో ఓ ప్రముఖ హోటల్‌గా ఎదిగింది. వీరికి సొంత బేకరీ ఉంది. రోజంతా అందులో ఉస్మానియా బిస్కెట్లు వండుతూ ఉంటారు. ప్రతి రోజు వేల కప్పుల టీ ఇక్కడ తయారవుతుంది. ప్రొద్దున నాలుగు గంటల నుండి అర్ధరాత్రి దాకా ఇక్కడ హైదరాబాదీయులకు టీ దొరుకుతుంది.

ఈ హోటల్ వాతావరణం అంత అందంగా ఉండదు. కాని ఆ బేకరీ చాయ్ ఔట్‌లెట్ పరిసరాలలో వచ్చే సువాసనలు హైదరాబాద్ ప్రజలకు ఒక ఊరటనిస్తాయి. ఎన్నోకొత్త హోటళ్లు గొప్ప అందమైన కట్టడాలతో ఆకర్షిస్తున్నా కేఫ్ బహార్‌కు సంవత్సరాలుగా వెళ్ళే టీ, బిరియానీ ప్రేమికులు మరో చోటకు వెళ్ళలేకపోతున్నారంటే ఈ హోటల్ హైదరాబాదీయులకు ఎంత ముఖ్యమో అర్థం చేసుకోవచ్చు.

కేఫ్ బహార్ స్థాపకుడు సయ్యద్ హుస్సైన్ బూలూకీ

టీ ఔట్‌లెట్‌లో ఉన్న మెనూ

ఇక్కడ ఇరానీ సమోసాలు కూడా ఇష్టపడి తింటారు హైదరాబాదీయులు. ఇరానీ సమోసా అంటే ఉల్లిపాయలతో చేసే చిన్ని సమోసాలు. చాలా ఇరానీ హోటళ్లలో ఇవి ఉంటాయి. బహార్ ఇరాని సమోసాలను స్థానికులు ఎంతో ఇష్టపడి తింటారు. హైదరాబాదీయుల మరో ప్రసిద్ధ వంటకం,  ఫైన్ బిస్కట్లు. ఇప్పుడు అన్ని బేకరీలలో ఇవి దొరకట్లేదు. తినేవాళ్లు తగ్గిపోతున్నారని ఈ బిస్కట్లను తయరు చేయడం తగ్గించారు. కాని కేఫ్ బహార్‌లో మాత్రం ఈ బిస్కట్లు ఇంకా దొరుతున్నాయి. ఉబ్బిన బిస్కెట్‌ను ఒకదానిపై ఒకటి చాలా సన్నని డౌ షీట్లుగా వేసి వీటిని తయారు చేస్తారు. ఇది పానీయంలో కరిగిపోతుంది. దీన్ని ఇరానీ చాయ్‌తో ఇష్టపడి తింటారు. ఇది హైదరాబాదీయులకు ఒక టీ-టైమ్ స్నాక్. అందుకే బహార్‌లో ఇప్పటికీ ఈ బిస్కట్లను తయారు చేస్తున్నారు. వీటి కోసమే అక్కడికి వెళ్ళేవాళ్లు ఉన్నారు. అలాగే టై ఆకారంలో ఉండే టై బిస్కట్లకూ ఈ బేకరీ ప్రసిద్ది.

బహార్ ముందు టీ కేఫ్‍గా, ప్రొవిషన్ స్టోర్‌గా మొదలయింది. తరువాతే బిరియానీ హలీంలతో ప్రసిద్ది కెక్కింది. కాని ఇప్పటికీ ఈ హోటల్ కేఫ్ బహార్ గానే ప్రసిద్ది. కేఫ్ అంటే టీ పాయింట్. ఇప్పుడు ఇది హైదరాబాద్‌లో పెద్ద బిరియానీ పాయింట్ కూడా. అయినా దీన్ని కేఫ్ బహార్ అనే అంటారు.

ఇక్కడ బిరియానీని కోరినట్టు అడిగి వండించుకుంటారు కస్టమర్లు. హైదరాబాదీ దం బిరియానీలో డబల్ మసాలా అడిగి వండించుకోవచ్చు. ఇక్కడ మటన్ టిక్కా మసాలా, భేజా ఫ్రై, చాలా పాపులర్. వీటిని నాన్‌తో తింటే ఆ రుచే వేరు. అర్ధరాత్రి కూడా బిరియానీ దొరికే చోటు కేఫ్ బహార్. ఈ హోటల్‌లో ఇరవై ఏళ్ళుగా పని చేస్తున్నవారిని ఈ బిరియానీ ప్రత్యేకత ఏంటీ అని అడిగితే వారు చెప్పిన విషయం “మా దగ్గర బిరియానీ ఐదు సంవత్సరాల పసి పిల్లల నుండి అరవై దాటిన వారికి కూడా అరుగుతుంది. మేం అతి తక్కువ మసాలాలతో హైదరాబాదీ బిరియానీని వండుతాం. దీని వల్ల కారం మసాలాలు పడని వాళ్ళు కూడా ఈ బిరియానీని ఇష్టంగా తిని ఆనందిస్తారు” అని చెప్పారు. నాతో వచ్చిన స్నేహితుడు కూడా తాను ఈ హోటల్ బిరియానీనే ఇష్టపడి తింటానని, తిన్న తరువాత ఇతర మసాలా వంటలు తిన్నప్పుడు అనిపించే కడుపు ఉబ్బరం లాంటివి ఇబ్బందులు తనకెప్పుడూ ఈ బిరియానీతో కలగలేదని, అందుకే హైదరాబాద్ లో కేఫ్ బహార్ కే తాను ఎక్కువగా వస్తానని చెప్పాడు. నాకూ అందులో వాస్తవం ఉందనే అనిపించింది. తిన్న తరువాత  చాలా లైట్‌గా అనిపించడంతో ఆ హోటల్ సిబ్బంది చెప్పిన దాంట్లో ఎంతో కొంత వాస్తవం ఉందని ఒప్పుకోవలసి వచ్చింది.

కొందరు ఇక్కడి మటన్ టిక్కా మసాలాను బాగా ఇష్టపడతారు. ఇది భారతదేశంలో దక్షిణ ప్రాంత వంటకం అని చెఫ్‌లు చెప్తారు. భేజా ఫ్రై మాత్రం పూర్తిగా హైదరాబాదీ వంటకం. దీని కోసం కేఫ్ బహార్‌కు వెళ్ళే వాళ్లు నాకు తెలుసు. ఇక ఇక్కడి ఖుబానీ కా మీఠా మర్చిపోలేం.

ఖుబానీ కా మీఠా పూర్తిగా మన హైదరాబాదీ వంటకం. ఇది ఎండు అప్రికార్ట్‌లతో చేసే తీపి పదార్ధం. హైదరాబాదీ వివాహాలలో ఇది తప్పకుండా వండుతారు. దీన్ని తయారు చేయడానికి ఆప్రికాట్లను సిరప్‍లో ఉడకబెడతారు. తరువాత  బాదం లేదా నేరేడు పండు గింజలను కలుపుతారు. తరువాత మలై (మందపాటి క్రీమ్, గేదె పాల నుండి), కానీ కస్టర్డ్ లేదా ఐస్ క్రీంతో కలిపి తింటారు. దీన్ని సాధారణంగా మలైతో వేడిగా వడ్డిస్తారు. శాకాహారులు ఎంతో ఇష్టంగా తినే హైదరాబాదీ వంటకం ఇది. కేఫ్ బహార్‌లో దీని రుచి బావుంటుంది.

కేఫ్ బహార్ రెండు అంతస్తుల భవనం. బషీర్‌బాగ్ మెయిన్ రోడ్డు వైపు ఉన్న భాగం ఇరానీ టీ కౌంటర్, బేకరీ, పాన్ పాయింట్. టీ కోసం వచ్చేవాళ్ళు ఇక్కడ గుంపులు గుంపులుగా కనిపిస్తారు. పక్కకు తిరిగి సందులోకి వెళితే బిరియానీ పాయింట్ ఉంటుంది. క్రింది అంతస్తులో కాలేజీ స్టూడెంట్లు యువకులు కనిపిస్తారు. పైన ఫస్ట్ ఫ్లోర్ లోని ఏ.సీ సెక్షన్‌కు స్త్రీలు, కుటుంబాలు వెళ్లడానికి ఇష్టపడతారు. మధ్యాహ్నం పూట రోడ్డు క్రింది దాకా వెయిటింగ్‌లో ఉంటారు భోజనప్రియులు. హైదరాబాద్ వంటకాలు కోసం ఈ హోటల్‌కి వెతుక్కుని వెళ్తుంటారు నగరాన్ని సందర్శించే వ్యక్తులు.

2024 అక్టోబర్ 10 నుండి బహార్ రెస్టారెంట్ 32 రోజుల పాటు మూత పడింది. కేఫ్ బహార్‌ను స్థాపించిన సయ్యద్ హుస్సేన్ బోలూకీ కోవిడ్ -19 సమయంలో ఇరాన్ లోని తన స్వస్థలానికి వెళ్లి అక్కడ చనిపోయారు. ఆ తరువాత ఈ వ్యాపారాన్ని వారసత్వంగా పొందిన కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు చెలరేగాయి. ఈ హోటల్ వాటాల పంపిణి కోసం గొడవలు జరిగి కుటుంబం కోర్టు కెక్కింది. బోలూకీ కుమారుడు సయ్యద్ అస్గర్ అలీ బోలూకీ నేతృత్వంలోని మెజారిటీ వర్గం బహార్‌లో 86 శాతం వాటా కలిగి ఉంది. మరో పక్క కుటుంబ సభ్యుడు బీబీ హజ్జర్ దష్టి నేతృత్వంలోని మైనారిటీ వర్గం మిగిలిన 14 శాతం వాటా కలిగి ఉంది. వీరి మధ్య వివాదం ముదిరి హోటల్ మూసి వేసారు. కోర్టు అస్గర్ అలీ బోలూకీని మేనేజీంగ్ పార్టనర్‌గా నియమించింది. కుటుంబ వివాదానికి శాశ్వత పరిష్కారం లభించే వరకు కేఫ్ బహార్ రోజువారీ కార్యకలాపాలను ఆయన పర్యవేక్షిస్తారు. అస్గర్ అలీ తప్పనిసరిగా ప్రతి వారం ఆర్థిక నివేదికలను సమర్పించాలి. వాల్యుయేషన్ పూర్తయిన తర్వాత, దష్టి 14 శాతం వాటాను కొనుగోలు చేయడానికి అస్గర్ అలీ బృందానికి మొదటి అవకాశం ఇస్తారు. వాళ్లు తిరస్కరిస్త్రే, దాష్టి మెజారిటీ 86 శాతం వాటాను కొనుగోలు చేయడానికి అవకాశం ఉంది.

ఇది కుటుంబ గొడవ కాని ఆ 32 రోజుల పాటు హోటల్ మూసివేతను ప్రజలు భరించలేకపోయారు. హోటల్ తెరిచిన కొన్ని గంటలకే వందల సంఖ్యలో అదే రోజు కస్టమర్లు క్యూ కట్టి ఇరానీ చాయ్ కోసం వచ్చారంటే ఈ హోటల్ వారి జీవితాలలో ఎంత ప్రధాన భాగం అయిందో అర్థం చేసుకోవచ్చు. ఆ ప్రాంతంలో ఉండే వాళ్ళందరూ మార్నింగ్ వాక్ తరువాత ఇక్కడే ఇరానీ టీ సేవించి ఇంటికి వెళ్లడం ఈ రోజుకీ చాలా మంది దినచర్యలో ఓ భాగం.

Exit mobile version