Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

ఆదాబ్ హైదరాబాద్..-3

[హైదరాబాద్‌ను పూర్తి స్థాయిలో తెలుసుకోవాలనే కోరికతో నగరంలో ప్రయాణించి పి. జ్యోతి గారు అందిస్తున్న ఫీచర్ ‘ఆదాబ్ హైదరాబాద్’.]

హైదరాబాదీ బిర్యానీ – ఇరానీ చాయ్

1. గ్రాండ్ హోటల్ – ఆబిడ్స్

హైదరాబాద్ అంటే ప్రపంచానికి గుర్తుకు వచ్చేవి రెండు. హైదరాబాదీ బిరియానీ, ఇరానీ చాయ్. మాంసాహారం తినని వాళ్లు క్షమించాలి కాని హైదరాబాదీ బిరియానీ స్వర్గానికి అడుగు దూరం దాకా తీసుకెళుతుంది అన్నది నిజం. అంతకు మించి నోరూరించే ఆహారం మరొకటి నాకు తెలీదు. హైదరాబాద్ నగర సంస్కృతిలో ఈ రెండు ప్రధాన అంశాలు. వీటికి చారిత్రిక, సాంస్కృతిక నేపథ్యం ఉంది.

 

హైదరాబాద్ మొదటి కాస్మోపాలిటన్ నగరం. ఇక్కడి నిజాం తమిళులని, పార్సీలను, సింధీలను, గుజరాతీలను, మార్వాడీలను, పంజాబీలను, మరాఠీలను ఈ నగరానికి ఆహ్వానించి వారికి ప్రత్యేకమైన ఆవాసాలు ఏర్పాటు చేసాడు. అందుకే మన నగరంలో ప్రాంతాల వారిగా వివిధ భాషా సంస్కృతులకు చెందిన వాళ్లు కలిసి ఉండడం చూస్తాం. అయితే వీళ్లందరినీ ఒక చోటకు చేర్చినది హైదరాబాదీ ఇరానీ చాయ్. ఇరానీ కెఫేలు అప్పట్లో ప్రతి సాంస్కృతిక, రాజకీయ సమావేశాలకు నిలయాలుగా ఉండేవి. వన్ బై టూ చాయ్ బిస్కట్టుతో లాగించి గంటలు గంటలు ఈ కెఫేలలో గడిపేవాళ్లు అప్పటి యువత. ఒకే టేబుల్ పై వివిధ భాషా సంస్కృతులకు చెందిన వాళ్లు కలిసి ఒకటిగా కూర్చుని సమావేశమై సాహిత్యం నుండి రాజకీయాల దాకా చర్చలు జరిపేవాళ్ళు. రేడియోలు ఇంటింటా లేని రోజుల్లో ఇక్కడే వార్తలు వినిపించేవి. పైగా ఇంట్లో పర్దా పాటించే ముస్లిం మార్వాడి, ఇతర కుటుంబాలలోని యువత, ఇరానీ కెఫేలలో స్నేహపూర్వకంగా కలుసుకుని ఒక సామాజిక వృత్తాన్ని నిర్మించుకునేవాళ్ళు.

అందుకే ఇరానీ టీ కేవలం చాయ్ కాదు వివిధ జాతులు, మతాలు, భాషా ప్రాంతాలను కలిపి ఒకటి చేసిన అద్భుత సంస్కృతికి ప్రతీక. అది హైదరాబాద్ ఆత్మ. ఇప్పుడు కెఫే డే లు, కాఫీ హౌస్‌లు అంటూ ఎన్ని వచ్చినా అలనాటి సాంస్కృతిక కలయికను మళ్ళీ ఆ స్థాయిలో అవి చిగురించజేయలేకపోతున్నాయి. ఇవి ఒక వర్గం వారి వరకే పరిమితమయి పోతున్నాయి. అందుకే ఇప్పటికీ ఇరానీ టీని ఇష్టపడేవాళ్ళు, ఇరానీ కెఫేలకు ఇష్టపడి వెళ్ళేవాళ్లు ఇంకా నగరంలో కనిపిస్తూ ఉంటారు.

హైదరాబాద్ బిర్యానీ ఈ నగరానికి ఎలా చేరింది అన్న దానికి చారిత్రిక ఆధారాలున్నాయి. హైదరాబాద్‌ను 1630లలో మొఘలులు స్వాధీనం చేసుకున్నారు, తరువాత నిజాంలు పాలించారు. అప్పుడు మొఘలాయి పాక సంప్రదాయాలు స్థానిక సంప్రదాయాలతో కలిసిపోయాయి. 18వ శతాబ్దం మధ్యలో మొదటి నిజాం నిజాం-ఉల్-ముల్క్, అసఫ్ జా I దగ్గర పని చేసే వంటమనిషి, వేటకు వెళ్లిన రాజకుటుంబీకుల కోసం మొదటి సారి ఈ హైదరాబాదీ బిర్యానీని తయారు చేసినట్లు స్థానిక జానపద కథలు చెబుతున్నాయి. 1857లో, ఢిల్లీలో మొఘల్ సామ్రాజ్యం క్షీణించినప్పుడు, హైదరాబాద్ దక్షిణాసియా సంస్కృతికి కేంద్రంగా మారింది. దానితో పాటు హైదరాబాదీ బిర్యానీ కొన్ని ప్రయోగాలతో ప్రత్యేక, ఘుమ ఘుమలను సొంతం చేసుకుంది. చరిత్రకారులు హైదరాబాదీ బిర్యానీ మూలాలు దక్షిన భారతదేశానికి చెందినవని, అరబ్ వ్యాపారులు దక్షిణ ఆసియాకు తీసుకువచ్చిన పులావ్ (పిలాఫ్) రకాల నుండి ఇది పుట్టిందని అంటారు. మధ్యయుగ భారతదేశంలో పులావ్ సైన్యంలో సైనికుల కోసం వండే ఆహారం. అందుబాటులో ఉన్న మాంసంతో ఒక కుండలో అన్నం వండి సైనికుల కోసం దీన్ని తయారు చేసేవాళ్లు. ‘పులావ్’, ‘బిర్యానీ’లు ఒకటి కావు. వాటిని వండే విధానంలో చాలా వ్యత్యాసం ఉంది. ఇది చాలా మందికి తెలియదు. మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ మునిమనవడు హిమాయత్ అలీ మీర్జా చెప్పినట్లుగా, హైదరాబాదీ బిర్యానీ దక్కనీ, తెలంగాణ రుచులతో ప్రస్తుత స్థితికి చేరింది. అలా హైదరాబాద్ బిరియానీ అసఫ్ జాహి వంటగదిలో పుట్టిందని చరిత్రకారులు స్పష్టం చేసారు. అందుకే ఆసఫ్ జాహీ కిచెన్ అంటూ కొన్ని ఔట్లెట్లు హైదరాబాద్‌లో ఇప్పుడు కూడా కనిపిస్తాయి. ఆసప్ జాహీ బిరియానీ పేరుతో కూడా కొన్ని హోటళ్ళు హైదరాబాది బిరియానీని విక్రయిస్తున్నాయి.

(ఆసఫ్ జాహి I – ఈయన వంటగదిలోనే మొదటిసారి హైదరాబాదీ బిరియానీ వండారు)

(ఆసఫ్ జాహి పేరుతో ఇప్పటికీ ప్రచారంలో ఉన్న బిరియాని అమ్మకాలు)

ఆధునీకరణ పేరుతో ఎన్నో ఇరానీ కెఫేలు పాత హోటళ్ళూ సినిమా హాళ్ళు కనుమరుగయి పోతున్నాయి. కాని ఆబిడ్స్ జి.పి.ఒ. పక్కన ఎన్నో జీవితాలను, మూడు తరాలను చూసిన గ్రాండ్ హోటల్ గర్వంగా ఇప్పటికీ నిలిచి ఉంది. పైగా అదే పాత సువాసనల హైదరాబాదీ బిర్యానీ ఇప్పటికీ అక్కడ మధ్యతరగతి కుటుంబాలకు అనుకూలమైన ధరలతో దొరుకుతుంది.

(గ్రాండ్ హోటల్ పగలు మధ్యాహ్నం, రాత్రులలో కిటకిటలాడుతూ)

గ్రాండ్ హోటల్ గురించి చెప్పుకోబోయే ముందు అసలు హైదరాబాద్‌కు ఇరానీయులు ఎందుకు వచ్చారు అన్నది చర్చించుకోవాలి. ఇరాన్‌లో నిరుద్యోగం కారణంగా బతుకు తెరువు వెతుక్కుంటూ ఇతర దేశాలకి వలస వెళ్లిన వాళ్లు ఎందరో. వీళ్లని మూడు వర్గాల వ్యక్తులుగా ఎంచవచ్చు. మొదటి వర్గం మేధావులు, బాగా చదువుకున్నవాళ్లు. వీళ్లు తమ భవిష్యత్తు కోసం యూ.కే., యూ.ఎస్.ల వైపుకు వెళ్లారు. తరువాత ధనిక వర్గం వస్తుంది. వీళ్లు బహ్రైన్, కువైట్, దుబాయ్ లలో పెట్టుబడులు పెట్టి వ్యాపారాలను నిర్మించుకోవడానికి వెళ్లిపోయారు. ఇక మూడవ వర్గం మధ్య తరగతి శ్రామిక వర్గం. వీళ్లకు పెద్దగా చదువులేదు. డబ్బు లేదు. వీళ్లు ఎక్కువగా షియా సాంప్రదాయానికి చెందినవాళ్లు.

ఇరాన్‌లో చాయ్ ఖోనా అనే సాంప్రదాయం ఉంది. నలుగురు కలిసి కూర్చుని సమయం గడపాలంటే బ్లాక్ టీ, హుక్కా, కొన్ని సార్లు కొన్ని సూప్‌లు పంచుకుంటూ సమావేశాలు జరుపుకునేవాళ్లు. ఇది వారి సాంప్రదాయంలో ఓ భాగం. ఈ మూడవ వర్గం బ్రిటీష్ పాలిత ప్రాంతాలకు వలస వెళ్ళారు. తమ చాయ్ ఖోనా సంప్రదాయాన్ని హోటల్ రూపంలో అక్కడ మొదలెట్టారు. ముందుగా వీళ్ళు కరాచీ చేరారు. మొదటి ఇరానీ హోటల్ కరాచీ ప్రాంతంలో మొదలయింది.

(కరాచీలో ఖైరాబాద్ అనే ప్రాచీన ఇరానీ హోటల్ అప్పుడు ఇప్పుడు)

అప్పట్లో టీ ఎగుమతి దిగుమతుల పైన చైనా ఆధిపత్యం నడిచేది. బ్రిటీషర్లు చైనాను టీ వ్యాపారంలో దెబ్బతీయాలని, ఆ పరిశ్రమలో తాము ఆధిపత్యం సంపాదించాలని కొన్ని ఆలోచనలు చేసారు. భారతీయులకు టీ తాగడాన్ని అలవాటు చేసారు. అదో పెద్ద రాజరికపు అలవాటుగా ఓ సాంప్రదాయాన్ని మొదలెట్టారు. టీ తాగేవాళ్లు మేధావులనీ, ధనికులని టీ సేవనంతో హోదా పెరుగుతుందని భారతీయులు నమ్మే స్థితికి చేరుకున్నారు. ఇక టీ హోటళ్ళకు ఇన్సెన్టివ్‌లు సబ్సిడీలు ఇచ్చి వాటిని ప్రోత్సహించారు. చాయ్ ఖోనా సంప్రదాయాన్ని అనుసరించే ఇరానీయులు ప్రభుత్వం కల్పించే రాయితీలను అందిపుచ్చుకుని తమ హోటళ్లను ఇక్కడ తెరవడం మొదలెట్టారు. కరాచీ నుండి కొందరు బొంబాయి చేరుకున్నారు. అక్కడి నుండి పూణేకు ఈ సంప్రదాయం తరలి వెళ్లింది.

(ముంబై లో కొన్ని ఇరానీ హోటళ్లు)

దక్షిణ ప్రాంతానికి రావాలనుకున్న ఇరానీయులు ఎంచుకున్న నగరం హైదరాబాద్. దానికి ప్రత్యేక కారణాలు లేకపోలేదు. హైదరాబాద్ నిజాం పాలనలో ఉంది. ఇక్కడ అధికార భాష ఉర్దూ. రెండవ భాష పర్షియన్. ఉర్దూలో ముప్పైశాతం పర్షియన్ పదాలుంటాయి. అంటే పర్షియన్ మాత్రమే మాట్లాడే ఇరానీయులకు హైదరాబాద్ ఉర్దూ తమ మాతృభాషకు చాలా దగ్గరగా అనిపించింది. ఇక్కడ పర్షియన్ భాషకూ ఆదరణ ఉంది. పైగా అప్పుడు పరిపాలిస్తున్న ఆఖరి హైదరాబాద్ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ తల్లి అమ్తుల్ జెహ్రా బేగం షియా మతస్తురాలు. మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ సున్నీ ముస్లిం అయినా తల్లి విశ్వాసం అతన్ని ఎంతో ప్రభావితం చేసింది. ఇది ముస్లింలలో అరుదుగా కనిపించే విషయం. అతను ఆజా ఖానా ఇ జెహ్రా అనే సంతాప సభా మందిరాన్ని తల్లి మరణానంతరం ఆమె విశ్వాసంపై గౌరవంతో 1930లో నిర్మించాడు. మొత్తం దక్షిణ భారత దేశంలోనే ఇది పెద్ద అసుర్ ఖానా. దానికి తల్లి పేరు పెట్టాడు. ఇందులో షియా సమాజానికి సంబంధించిన చారిత్రిక అవశేషాలను ఉన్నాయి. అంటే నిజాం షియాల పట్ల స్నేహ భావాన్ని ప్రదర్శించేవాడు. దీనితో హైదరాబాద్‌లో తమకు రాజకీయ అండ కూడా లభిస్తుందని ఇరానీయులకు అర్థం అయింది. అలా హైదరాబాద్ చేరిన పన్నెండు మంది ఇరానీయులు భాగస్వాములుగా కలిసి 1935లో మొదలు పెట్టినదే ఈ గ్రాండ్ హోటల్.

(మీర్ ఉస్మాన్ అలీ ఖాన్)

(ఆజా ఖానా ఇ జెహ్రా)

ఈ హోటల్‌లో అప్పుడు పని చేసే వాళ్లంతా ఇరానీయులే. అందరూ అవివాహితులే. ఇది హోటల్ ఇంక రెస్టారెంట్ గా ప్రారంభించారు. ఇందులో 22 గదులుండేవి. ఏ గదికి కూడా అటాచ్డ్ బాత్ రూమ్ ఉండేది కాదు. ఇప్పటికీ ఆ రోజుల్లో కట్టిన సెపరేట్ బాత్ రూమ్‌లు ఈ హోటల్‌లో అలాగే ఉన్నాయి. ఈ హోటల్ ప్రాంతంలోనే వారికి ఓ స్వంత బేకరీ, శీతల పానీయాలు, ఐస్ క్రీం తయారు చేసే ఫాక్టరీ కూడా ఉండేవి.

అరవైలకు వచ్చే సరికి ఇరాన్‌లో పెట్రోల్ బావులు పుంజుకున్నాయి. అక్కడ ఉద్యోగ అవకాశాలు పెరిగాయి. ఎందరో విదేశీయులు తమ దేశం తిరిగి వెళ్లిపోయారు. గ్రాండ్ హోటల్ భాగస్వాములు కూడా తమ దేశానికి తిరిగి వెళ్లిపోతూ, తమ షేర్లను అమ్మేసారు. అలి కషాని అనే వ్యక్తి ఆ షేర్లను కొన్నాడు. అతని కూతురు, ఆమె భర్త మహమ్మద్ ఫర్రూక్ ర్వోజ్ కూడా ఇక్కడే ఉండిపోయారు. వీళ్ళిద్దరి హయాంలో గ్రాండ్ హోటల్ అభివృద్ది చెందింది. హైదరాబాద్‌లో ఓ ప్రముఖ స్థలంగా చరిత్రలో నిలిచిపోయింది. 1988లో అలీ కషాని మరణించారు. అతని షేర్లను అతని మనవడు మహమ్మద్ జలీల్ ఫర్రూక్ ర్వోజ్ కొన్నాడు. ఇప్పడు ఆయనే గ్రాండ్ హోటల్ మేనేజింగ్ పార్టనర్ గా వ్యవ్యహరిస్తున్నారు.

(గ్రాండ్ హోటల్ ప్రస్తుత మేనేజింగ్ పార్టనర్ మొహమ్మద్ జలీల్ ఫర్రూఖ్ ర్వోజ్)

(గ్రాండ్ పై అంతస్తులో ఓ మధ్యాహ్న సమయం)

జలీల్ ఫర్రూక్ ర్వోజ్ గ్రాండ్ హోటల్ మూడవ తరానికి చెందిన వారు. వీరు నలుగురు అన్నదమ్ములు. అయితే ముగ్గురు డాక్టర్లుగా అమెరికాలో స్థిరపడ్డారు. అక్కడే ఫార్మసీ చదివిన జలీల్ 1999లో ఇక్కడ ఆర్ధిక లావాదేవీలు చూసుకోవడానికి వచ్చి అనుకోకుండా ఈ హోటల్‌కు పార్టనర్‌గా మారారు. ఆయనకు భారత దేశంలోని జీవితం నచ్చింది. ఇక్కడే పంజాబీ స్త్రీని వివాహం చేసుకున్నారు. క్రమంగా ఈ హోటల్ ఆయన ప్రపంచంగా మారింది.

ఆబిడ్స్‌లో ఈ హోటల్‌కు కాస్త దూరంలో కొన్ని ఇరానీ హోటళ్లు ఉండేవి. కాని అవన్నీ కాలగర్భంలో కలిసిపోయాయి. గ్రాండ్ హోటల్ కూడా కొన్ని విపత్కర పరిస్థితులను ఎదుర్కుంది. కాని ఆ హోటల్‌ను పట్టుదలతో నడిపించారు జలీల్. ప్రస్తుతం హైదరాబాదు, పరిసర ప్రాంతాలలో మెహ్ఫిల్ అనే చైన్ హోటళ్ళకూ ఆయన పార్టనర్గా వ్యవహరిస్తునారు.

ఒక రోజు ఆదివారం ఉదయం ఎనిమిది గంటలకు ఈ హోటల్‌కు వెళ్లి అక్కడే హైదరాబాదీ రుచులతో బ్రేక్‌ఫాస్ట్ చేసాను. మధ్యాహ్నం మళ్లీ అదే హోటల్‌లో భోజనం రుచి చూసి, దానిపై సమగ్రమైన సమాచారాన్ని సేకరిస్తున్నానని చెప్పడంతో పైన ఆఫీసులో ఉన్న జలీల్ గారిని కలిసే అవకాశం కలిగించారు హోటల్ సిబ్బంది. నా ఉత్సాహాన్ని గమనించి ఆ హోటల్ గతాన్ని, హైదరాబాద్‌లో ఇరానీ హోటళ్ళ చరిత్రకు సంబంధించి తనకు తెలిసిన విషయాలన్నిటినీ ఓపిగ్గా వివరించారు జలీల్. అయన మాటలలో తన వృత్తి పట్ల నమ్మకం, గౌరవం కనిపించాయి. హైదరాబాద్‌లో పుట్టి పెరిగి ఎన్నో హోటళ్ళు సినిమా హాళ్ళు కళ్ళ ముందు చరిత్రలో కలిసిపోతుంటే మౌనంగా చూసే నాకు జలీల్ గారు గ్రాండ్ హోటల్ భవిష్యత్తు పై ఉన్న భయాలను తొలగించారు. ఇప్పుడు హైదరాబాద్‌లో ఉన్న అతి పాత హోటల్ ఇదే. కాని ఆయన దాన్ని కాపాడటమే తన లక్ష్యం అని బదులిచ్చారు.

ఈ హోటల్ గురించి ఎందరో చెప్పగా విన్నాను. లాల్ బహాదుర్ స్టేడియం లోనూ, నిజాం గ్రౌండ్స్ పరిసర ప్రాంతాల లోనూ ఎన్నో రాజకీయ మీటింగులు జరిగినప్పుడు చాలా మంది నాయకులు కలుసుకునే స్థలం గ్రాండ్ హోటల్. అంజయ్య గారు కూడా ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈ హోటల్‌లో ఓ టేబుల్ వద్ద చాలా మందిని కలిసేవారని జలీల్ చెప్పారు. ఇక ఉద్యమ పంథాలోకి వెళ్ళిన స్టూడెంట్ నాయకులు చాలా మంది చాలా సందర్భాలలో కలుసుకున్న చోటు కూడా ఈ హోటలే అని విన్నాను.

ఆ హోటల్‌ను పాతిక సంవత్సరాల క్రితం తన చేతుల్లోకి తీసుకున్నప్పుడు తాను యువకుడినని, అంత అనుభవం లేనివాడనని చెప్తూ దానితో కొని తప్పులు చేసానన్నారు జలీల్. అప్పట్లో ఆ హోటల్ మొత్తం బెల్జియం అద్దాలతోనూ చెక్క పార్టిషన్ల తోనూ ఉండేదని, తాను వాటి విలువ తెలుసుకోకుండా అన్నిటిని తీసేయించానని చెప్పారు. ఎప్పటికయినా అలనాటి గ్రాండ్ వాతావరణాన్ని తిరిగి తీసుకురావాలన్నది తన ప్రస్తుత ధ్యేయం అని, తాను రిటైర్ అయ్యే లోపు గ్రాండ్‌ను ఆ పాత రూపానికి తీసుకు వెళతానని ఎంతో నమ్మకంగా చెప్పారు జలీల్. పదిహేను సంవత్సరాల నిజాం పాలన, అటు తర్వాత ఉమ్మడి ఆంద్రప్రదేశ్ పాలన ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర పాలనను అనుభవించిన గ్రాండ్ హోటల్ హైదారాబాద్ చరిత్రలో ఓ భాగం.

ఈ హోటల్ 1935 నుండి అదే స్థానంలో ఉంది. అయితే లోపల చాలా మార్పులు జరిగాయి. అయినా ఇప్పటికీ ఆ పాత రెస్టారెంట్ వాసన ఇంకా మిగిలి ఉంది. హైదరాబాద్‌లో డెభ్భై సంవత్సరాల క్రితం కమర్షియల్‌గా బిరియానీని అమ్మడం మొదలుపెట్టిన మొదటి హోటల్ ఇది. అప్పట్లో నిజాం కుటుంబీకులు, రాచరికపు వ్యక్తులు హోటల్‌కు వచ్చి భోంచేయడానికి బిడియపడేవారట. అందుకని వారి కోసం చెక్క తలుపులు అడ్దు పెట్టి ప్రైవసీ సృష్టించారు. అది ఆ హోటల్ ట్రేడ్ మార్క్‌గా మారింది. దానితో ఎందరో నిజాం కుటుంబీకులు ఈ హోటల్‌లో భోజనానికి వచ్చేవాళ్లు. ఇక్కడ మటన్ మసాలా మటన్ నిహారి రుచి చూడాల్సిందే. పదిహేనేళ్ళ క్రితం చైనీస్ మొగలాయి వంటకాలను కూడా వీళ్ళు ప్రవేశపెట్టారు. ఇక హైదరాబాదీ కబాబ్‌లు తినాలంటే ప్రస్తుతం ఉన్న నమ్మకమైన హోటల్ గ్రాండ్ అని చెప్పవచ్చు. కొన్నేళ్ళ క్రితం స్వాతంత్ర దినోత్సవం నాడు తిరంగా కబాబ్ అని మూడు రంగులలో కబాబ్ లను తయారు చేసి ప్రజలకు రుచి చూపించారు. అది ఇప్పటికీ జనం మెచ్చే ఆహారం. ఆంధ్రా ప్రాంతపు వారి కోసం కారంపొడి చికెన్, రొయ్యలను కూడా వీళ్లు వండి వడ్డిస్తారు.

ఇరానీ హోటళ్లలో జనం ఎనభై శాతం బిరియానీ కోసం మిగతా ఇరవై శాతం ఇతర పదార్థాలు రుచి చూడడానికి వెళతారు. బిరియానీని ప్రజలు ఇష్టపడడానికి కారణాన్ని జమీల్ ఈ విధంగా చెప్పారు. ఇది పూర్తి ఆహారం. అంటే ఒక బిరియానీ ఆర్డర్ చేసాక మరే ఇతర ఆహార పదార్థాల అవసరం రాదు. ఒక కుటుంబం ఇంట్లో బిరియానీ వండుకున్నదానికన్నా చవకగా అదే క్వాలిటీతో ఈ హోటల్లో వారికి దొరుకుతుంది. ఆకాశాన్ని అంటే ధరలు ఇక్కడ ఏ పదార్థానికీ లేవు. అందుకే ఈ హోటల్‌లో ఎక్కువగా మధ్యతరగతి వాళ్లు కనిపించారు. సిటీలో ఇతర హోటళ్ళలో ఎక్కడా ఆ స్థాయి వ్యక్తులు ఎక్కువ సంఖ్యలో కనిపించరు. ఓ కుటుంబం తృప్తిగా భోంచేయాలంటే జేబులు ఖాళీ చేసుకోవలసిన పరిస్థితి బైట హోటళ్లలో ఉంటే, మరచిపోలేని సాంప్రదాయ రుచులతో భోజనాన్ని, భారమైన బిల్లులతో ప్రజలను బలి చేయకుండా వడ్డిస్తుంది గ్రాండ్ హోటల్.

ఒకప్పుడు ఈ హోటల్ ప్రారంభించిన రోజుల్లో కట్టెలపై వంట జరిగేది. ఇప్పుడు ఎకో ఫ్రెండ్లీ బాయలర్లను వాడుతున్నారు. బిరియానీకి పొగ వాసన రుచిని ఇంకా పెంచుతుంది. గ్రాండ్‌లో పాత పద్దతిలోనే ప్రత్యేకమైన పొయ్యిలపై బిరియానీ వండుతారు. గ్రాండ్ హోటల్ వంటగది పాత సంప్రదాయ రీతిలో బిరియానీని వండడానికి అనుకూలంగా ఉంది. పూర్తి ఎలక్ట్రిక్ పరికరాలకు ఇతర హోటళ్ళు మారిపోవడం ఆ హోటళ్లలో బిరియానీ రుచి మారడం వెనుక ఉన్న ముఖ్య కారణం.

ఈ హోటల్ బిరియానీ ప్రత్యేకత కస్టమైజ్ట్‌గా వడ్డించే అవకాశం ఉండడం. అంటే మనకు కావల్సిన విధంగా మసాలాలను తగ్గించి పెంచి తీసుకురమ్మని అడిగే అవకాశం ఉంది. అది ఏ ఇతర ఆధునిక హోటల్ లోనూ లభించని సౌకర్యం. ఎందుకంటే వీళ్లు పాత పద్దతిలోనే వండుతున్నారు. రిమోట్‌తో టైమర్ సెట్ చేసి వండడం ఇక్కడ జరగదు కాబట్టి కస్టమర్ల రుచులకు అనుగుణంగా దినుసులు తగ్గించి, పెంచే వెసులుబాటు ఉంది. అది ఈ హోటల్‌కు కస్టమర్లు వెతుక్కుని మరీ రావడం వెనుక ఉన్న కారణం. ఇప్పటికీ తక్కువ ఎర్ర కారం ఎక్కువ మొగలాయ్ మసాలా దినుసులు వేసి వండి వడ్డించే బిరియాని గ్రాండ్ హోటల్‌లో దొరుకుతుంది. అందుకే తినేటప్పుడు నెయ్యి ఎక్కువ అయినట్లు చేతికి అంటి చికాకు పెట్టదు, మసాలా ముద్దలు ముద్దలుగా చేతికి తగలదు. స్వచ్చమైన హైదరాబాదీ బిరియానీ ఇష్టపడే వారికి ఇక్కడ పండగే. గ్రాండ్ హోటల్‌లో నాన్‌తో మటన్ నిహారీ, తరువాత ఓ ఇరానీ చాయ్ ప్రొద్దున బ్రేక్‌ఫాస్ట్‌కి తరువాత అలా చార్మినార్ దాకా చక్కర్లు కొట్టి మధ్యాహం తిరిగి వచ్చి ఓ మటన్ బిరియానీ లాగించి చూడండి హైదరాబాద్ నగరాన్ని ప్రేమించకుండా ఉండలేరు.

(నాన్ మటన్ నిహారీ)

(హైదరాబాదీ మటన్ మసాలా)

గ్రాండ్ హోటల్ క్రింద వచ్చి వెళ్లిపోయే స్టూడెంట్స్, ఉద్యోగస్తులతో రద్దీగా ఉంటుంది. పై అంతస్తులో కుటుంబాలతో వచ్చే వాళ్లు ఎక్కువగా కనిపిస్తారు.

(గ్రాండ్ హోటల్ లో అలనాటి బాల్కనీ)

(గ్రాండ్ హోటల్ లో అలనాటి బాల్కనీ)

ఆ పక్కన బాల్కనీ 1935 నాటిదే. ఆ భాగాన్ని అలాగే అలనాటి గుర్తుగా ఉంచేసారు. ఇప్పటికీ ముందుగా బుక్ చేసుకుని ఇక్కడకు వచ్చి భోజనం చేసే వాళ్లు చాలా మంది హైదరాబాదీయులు ఉన్నారు. కొందరు వారి పర్సనల్ పార్టీలకు కూడా ఈ బాల్కనీని ఉపయోగించుకుంటారు. క్రింద ఆగకుండా హడావిడిగా పరుగులు పెట్టే ట్రాఫిక్, పైన బాల్కనీలో అచ్చమైన హైదరాబాదీ ఆహారం ఆస్వాదిస్తూ తినడం ఓ గమ్మత్తైన అనుభూతి. మనిషి గొంతే వినిపించని రెస్టారెంట్ లకు వెళ్ళేవాళ్లు ఒక్కసారి ఇలా గ్రాండ్‌లో భోజనం చేసి చూడండి. ఒక నగరాన్ని స్పృశించిన భావం కలుగుతుంది.

(ఈ వ్యాసం కోసం ఎంతో సమాచారాన్ని అందించిన గ్రాండ్ హోటల్ మానేజింగ్ పార్టనర్ మొహమ్మద్ జలీల్ ఫర్రూక్ ర్వోజ్ గారికి కృతజ్ఞతలు)

Exit mobile version