[జూన్ 28 మాజీ ప్రధాని పి.వి. నరసింహారావు గారి జయంతి సందర్భంగా, ‘ఆయన సంస్కరణలకు ఆద్యుడు, మహోన్నతుడు!’ అనే రచనని అందిస్తున్నారు శ్రీమతి ఏ. అన్నపూర్ణ.]
శ్రీ పాములపర్తి వెంకట నరసింహరావుగారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు ప్రవేశపెట్టిన సంస్కరణలో ‘తెలుగుఅకాడమీ’ స్థాపన ఒకటి.
జూన్ 28వ తేదీ వారి జన్మదినం సందర్భంగా ఆ విషయం మరోసారి గుర్తుచేసుకుందాము.
నాకు ఓటు హక్కు రాక ముందు రాజకీయాలు అంతగా తెలియవు. కానీ జనరల్ నాలెడ్జ్ పట్ల వుండే ఇష్టం వలన, రోజూ న్యూస్ పేపర్ చదవడం వలన దేశ ప్రధాని రాష్ట్రపతి, రాష్ట్ర ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి, గవర్నర్ ఎవరూ అని తెలుసుకునేదాన్ని. ప్రముఖులు రాసిన వ్యాసాలూ తెలుగు వార్తాపత్రికలో, ఇంగ్లీష్ వ్యాసాలూ హిందూ పేపర్ లోను చదవడం, జరిగిన కొన్ని సంఘటనలు రేడియోలో వినడం వలన ఆసక్తి పెరుగుతూ వచ్చింది.
మా తండ్రిగారు రైటర్. ఇంగ్లీష్ లెక్చరరుగా P R కాలేజీలో పనిచేయడం వలన తొలి సంతానంగా అన్ని విషయాలు నాతో పంచుకోవడం వలన లోకజ్ఞానం పట్టుబడింది. అవకాశాలు వచ్చాయి. ఓటు వేసే వయసు నాటికి ఎవరు మంచి పనులు చేస్తున్నారు? ఎవరు విద్యావంతులు? వారి రాజకీయ కుటుంబ చరిత్ర ఏమిటి? అని తెలుసుకోడం వల్ల, ఎన్నో విషయాల పట్ల అవగాహన ఏర్పడింది.
కాసు బ్రహ్మానంద రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పీవీ గారిని విద్యాశాఖ మంత్రిగా నియమించారు. తరువాత రాష్ట్ర భాషా సంస్థగా ‘తెలుగు అకాడమీ’కి బీజం పడింది.
1968 ఆగష్టు 6 వతేదీ ప్రారంభం అయింది. ఎంతో అనుభవం వున్న అధ్యాపకులను అన్ని కాలేజీల నుంచి సెలక్ట్ చేసి నియమించారు. వారిలో మాథ్స్ సబ్జెక్టులో ఏ. పద్మనాభం (నా శ్రీవారు) ఒకరు.
దీని స్థాపనకు మూడు ప్రధాన లక్ష్యాలు. అవి
- అధికారభాషగా తెలుగును అమలుచేయడానికి రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించడం
- తెలుగు భాషను ఆధునీకరించడం
- ఉన్నతవిద్యకు సంబంధించి అన్ని స్థాయిల్లో తెలుగును బోధనా మాధ్యమంగా ప్రవేశపెట్టి స్థిరపరచి వ్యాప్తి చేసే కృషిలో విశ్వ విద్యాలయాలకు సహకరించడం
ఆధునిక విజ్ఞాన శాస్త్ర గ్రంథాలు ఇంగ్లీషులో ఉండటం వలన అన్నివర్గాల తరగతుల విద్యార్థులకు, ఇంగ్లీష్ రానివారికి ప్రయోజనం కలిగించడానికి ‘తెలుగు అకాడమీ’ సాధనం కావాలని ఆలోచనతో స్థాపించడం జరిగింది. కేవలం పాఠ్యపుస్తకాలే కాకుండా అందరూ చదివే జనరంజకమైన గ్రంథాలను ప్రచురించడంలోనూ కొత్త ఒరవడికి శ్రీకారంగా నిలిచింది ‘తెలుగు అకాడమీ’.
అనువాదాలు, అన్నిభాషల నుంచి నిఘంటువులు, ఆధునిక శాస్త్ర సాంకేతిక భాషా సాహిత్యం, సాంఘిక, మానవీయ పరిజ్ఞానాన్ని అందించడంలో కృషి చేయడం విశేషం.
ఇన్ని ప్రధాన లక్ష్యాలతో పురోగమిస్తున్న ఈ ‘తెలుగు అకాడమీ’కి అధ్యక్షులు శ్రీ పి.వి. నరసింహారావు గారు తెలుగు బిడ్డ, బహుభాషా కోవిదుడు, సౌజన్యమూర్తి, అపరమేధావి కావడం మనకు ఎనలేని గర్వకారణం.
1968లో వారి అధ్యక్షతన ప్రారంభమైన ఈ సంస్థ స్వయం ప్రతిపత్తితో అనేక గ్రంథాలను ప్రచురిస్తోంది. రాజధాని నగరానికే శోభను తెచ్చిన సంస్థ ఈ తెలుగు అకాడమీ.
ఇంటర్మీడియట్, డిగ్రీ స్థాయి పాఠ్యపుస్తకాలు ,అనువాదాలను ప్రచురించడం తెలుగు సంస్కృతం ఉర్దూ భాషల విశిష్టతను పరిశీలించడం పామర జనాలకు అర్ధం అయేలా బోధించే విధానాన్ని శిక్షణా తరగతుల నిర్వహణ బోధనాసామాగ్రి సేకరణ నివేదికల ప్రచురణకు కృషి, తెలుగు అకాడమీ నిర్దేశించిన ప్రధాన లక్ష్యాలు నెరవేరడంలో విశిష్టతను సంతరించుకుంది. శ్రీ పీ వీగారి చేతులమీద నెలకొల్పిన ఈ సంస్థ ప్రవర్ధమానమై విలసిల్లుతూ.. శ్రీ పీవీని సదా గుర్తు చేస్తూనే ఉంటుంది!
ఇంటర్మీడియట్ బోర్డు స్థాపన పీవీ గారి ఆలోచన. ఆయన సేవలు చిరస్మరణీయం. ఇవి గాక కొత్తగా నియమించే యువ లెక్చరర్లకు ట్రైనింగ్, సీనియర్ లెక్చరర్లకు సెమినార్లు నిర్వహించేవారు. ఆంధ్రప్రదేశ్లో శాటిలైట్ ఇన్స్ట్రక్షన్ అండ్ టీవీ ఎడ్యుకేషన్ ప్రారంభించారు. NCIRT ఎడ్యుకేషన్ టెక్నాలజీ డిపార్ట్మెంట్ స్థాపన కూడా జరిగింది. దేశంలోనే మొదటిసారి సమగ్ర విద్యా బిల్లు శాసన సభలో ప్రవేశపెట్టారు. విద్యలో అత్యుత్తమ విద్యా ప్రమాణాలు సాధించడానికి, నాణ్యత పెంపొందించడానికి చేసే ప్రయోగాలను, అధికారులను పీవీ ఎప్పుడూ ప్రోత్సహించేవారు. విద్యా శాఖ పనితీరుపై తనిఖీ నిర్వహించి, నివేదిక సమర్పించమని అడ్మినిస్టేటివ్ స్టాఫ్ కాలేజీని ఆదేశించడం జరిగింది. పీవీ ఆదేశాలను అందరూ తప్పనిసరిగా పాటించవలసి వచ్చేది. వారు ఎప్పుడూ విధి నిర్వహణకు లోపం జరిగితే ఒప్పుకునేవారు కాదు.
1968 లోనే విద్యా శాఖమంత్రిగా ‘లైబ్రెరీస్ కమాండ్మెంట్ బిల్’ ప్రవేశపెట్టడం వలన జిల్లా గ్రంథాలయ సంస్థలు ప్రారంభమయ్యాయి. గవర్నమెంట్ లైబ్రెరీలలో క్లాసిక్స్ తప్పనిసరిగా వుండాలని ఆదేశాలు ఇచ్చి, విలువైన గ్రంథాలను సేకరించి భద్రపరచాలని సూచించారు. ఇలాంటి మహత్తరమైన సదుపాయం కల్పించి చరిత్రను సృష్టించారు!
ఎందరో రచయితలు, అధ్యాపకులు, విద్యార్థులకు అకాడమీ గ్రంథాలు వెలకట్టలేని సంపద. భవితకు మార్గదర్శకాలు. పరిశోధనకు అక్షయపాత్ర ‘తెలుగు అకాడమీ’ స్థాపన.
సాహిత్యానికి వారు ఎప్పుడూ ఆత్మీయులే. ఎవరు గ్రంథావిష్కరణకు పిలిచినా కాదనలేదు. అందులో మా తండ్రిగారు బులుసు వెంకటేశ్వర్లు (ఇంగ్లీష్ లెక్చరర్, పి. ఆర్. కాలేజీ, కాకినాడ) రచించిన గ్రంథాలను వారి చేతుల మీదుగా ఆవిష్కరించడం గొప్ప భాగ్యంగా తరతరాలుగా చెప్పుకుంటూనే ఉంటాము.
నాది కాకినాడ. బులుసు వెంకటేశ్వర్లు గారి అమ్మాయిని. వారు వృత్తి రీత్యా పిఠాపురం రాజావారి కళాశాలలో ఇంగ్లీష్ లెక్చరర్. కానీ తెలుగులో శతాధిక గ్రంథకర్త. వారు రాసిన ‘మహర్షుల చరిత్ర’ టీటీడీ దేవస్థానం ప్రచురణ హక్కు తీసుకుంది. నాన్నగారి స్వంత లైబ్రెరీ నాలుగు బీరువాలు ఆయనకు ఆస్తి. నాకు ఆసక్తి పెరిగి ఒకొక్కటే చదవడం మొదలుపెట్టేను. అందులో నాకు బాగా నచ్చినవి విశ్వనాథ వారి ‘ఏకవీర’, శరత్ బాబు, ప్రేమ్చంద్, తిలక్, భారతి మాసపత్రిక, నాన్నగారు రాసిన వ్యాసాలు ప్రింట్ అయిన తెలుగు-ఇంగ్లీషు వార్తా పత్రికలూ. ఇంటి ఎదురుగా వున్న ‘ఈశ్వర పుస్తక బాండాగారం లైబ్రెరీ’ కి వచ్చే పిల్లల పత్రికలూ, వార మాస పత్రికలూ వదలకుండా చదవడం అలవాటైంది. పెళ్ళయ్యాక కూడా అందుకు ఎలాంటి ఇబ్బంది రాలేదు. చదివిన తర్వాత నా అభిప్రాయం ఉత్తరాలు రాసేదాన్ని. కుటుంబ బాధ్యతలు తీరి ఖాళీ లభించిన తర్వాత రచనలు చేయాలని ఆలోచన వచ్చింది. రచన, చతుర-విపులతో మొదలై అన్ని పత్రికలూ ప్రోత్సాహం ఇచ్చాయి. హైదరాబాద్ వచ్చాక జయప్రకాష్ నారాయణ్ గారి ఉద్యమ సంస్థలో చేరాను. వారి మాసపత్రికలో వ్యాసాలూ రాసాను. అలా కొనసాగుతూ పిల్లలు అమెరికాలో స్థిరపడితే వెళ్ళి వస్తూ వున్నప్పుడు కొత్త సబ్జెక్ట్ లభించేది. అక్కడి వెబ్ పత్రికలూ సిరిమల్లె, కౌముది, శాక్రిమెంటో తెలుగు-వెలుగు పత్రికల్లోనూ నా కథలు, కవితలు వచ్చాయి. ఇప్పటికి రాస్తూనే వున్నాను. చదువుతూ కొత్త విషయాలు తెలుసుకుంటూనే ఉండాలనే ఆసక్తి వుంది. అవి అన్ని సబ్జెక్టులలో కూడా. ఈ వ్యాపకాలు జీవితకాలం తోడు ఉంటాయి. ఈ సంతృప్తి చాలు.