Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

ఆత్మీయత

[శ్రీమతి జొన్నలగడ్డ శేషమ్మ రచించిన ‘ఆత్మీయత’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]

జానకి వంట చేస్తోంది. మధ్యాహ్నం 12, బెల్లు మోగింది.

“కొరియర్”

వెళ్లి సంతకం చేసి కవరు తీసుకుంది.

విభ, తన బెస్ట్ ఫ్రెండ్. ఫోన్ చేస్తూనే వుంటుంది. సరదాగా మెసేజిలు మొదలైనవి. వాళ్లిద్దరి మధ్య ఎన్నడూ అతి లేదు. అన్నీ అవసరం మేరకే – నిజం చెప్పాలంటే – రోజూ గుడ్ మార్నింగ్ అని పువ్వో, కాయో పెట్టడం, ఏం చేతకాక పోతే ఏదో ఓ ఫోటో, ఆఖరుకు మళ్లీ గుడ్ మార్నింగ్! ఇలా ఈ రోజుల్లో అలవాటయి పోయింది కదా సరే – అది పక్కన పెడితే ‘పెమ్మరాజు విభావరి, మహారాణీపేట, విశాఖపట్టణం’ అని కవరుపై చూసింది. కొంచెం బరువు గానే ఉంది. వంట, భోజనం, ముగించి, ఉత్తరం చదవడం మొదలెట్టింది జానకి.

“జానకీ, నీ దగ్గర కొన్ని విషయాలు తెలుసుకోవాలని వ్రాస్తున్నాను. బరోడాలో వున్నావు కదా, ఉత్తరాది సాంప్రదాయాలు గొప్పవి. అందులోనూ గుజరాత్‌కు ప్రత్యేకత. ఉమ్మడి కుటుంబాలు, అవిభక్త కుటుంబాలు, తరతరాలుగా కలసి వ్యాపారాలు, పెద్ద ఇళ్లు, తాతగారు, బొమ్మగారు, తల్లిదండ్రులు, యువకులు, వారి భార్యాపిల్లలు – ఇలా అంతా కలిసి ఒకే ఇంట్లో నివసిస్తారు. ఇంటికి తాళం వేయాల్సిన పరిస్థితే రాదు. ఎంత హాయో కదా. ఇవన్నీ వార్తల్లో చూస్తుంటాను. పుస్తకాల్లో చదువుతూంటాను.

నీవు మీ మామ గారి మరణానంతరం మీ అత్తమ్మను కన్నతల్లి వలె చూస్తున్నావని, ఇక్కడ మొన్న ఒక బంధువుల ఇంట్లో పెళ్లిలో చెప్పుకుంటున్నారు. నాకు ఎంతో ఆనందం, కొంచెం గర్వం కూడా కలిగేయిలే.

మన తెలుగు రాష్ట్రాల్లో అలాంటి పరిస్థితులు తక్కువ. సీనియర్ సిటిజన్లకు ఎన్నో ఇబ్బందులు. వాళ్లు ఇంట్లో వుంటే పిల్లలు గారంతో చెడిపోతారని, చాదస్తం పెరిగినందున అతి చేస్తారని, సమయపాలన ఉండదని భావిస్తున్నారు, నేటి తరం తల్లులు.

తమ ప్రైవసీకి భంగమని కొందరి అభిప్రాయం. తమ స్నేహితులతో స్వేచ్ఛగా రాకపోకలు కుదరవని, వంట దగ్గరనుండి అన్నింటిలోనూ పెద్దవాళ్ల విషయంలో వేరే శ్రద్ధ పెట్టాలని, ఇదొక న్యూసెన్స్‌గా మరికొందరి ఉద్దేశము.

మేము నివసిస్తున్న అపార్ట్‌మెంట్ లోనే ఇటీవల చాల మార్పులు గమనించేను. ఫ్లాట్‌లో ఎవరున్నారో ప్రక్కనున్న ఫ్లాట్ వారికి తెలియదు. తలుపులు తీసుకొని ఎవరూ బయటకు రారు. వచ్చినా పలకరింపులు ఉండవు. వింత బ్రతుకులయిపోయేయి.

ఈ మధ్య ఇక్కడ మూర్తి గారి భార్య మరణించింది. మూడు నెలలయింది. నిన్న మూర్తి గారు బయటకు వచ్చేరు. పోల్చుకోలేక పోయేను. మాసిన గడ్డం, వంగిపోయి నడక, దైన్యంతో వుంది ముఖమంతా. అడుగులు తడబడు తున్నాయి. పనివాడు చెయ్యిపట్టుకుని నడిపిస్తున్నాడు, ఎంత చురుకుగా చలాకీగా నవ్వుతూ వుండే మనిషిలో ఎంత మార్పు!

క్రింది అంతస్తులో గీత గారు పరిచితులు. ఆమె ద్యారా సమాచారం ఏమంటే, మూర్తి గారి భార్య పార్వతమ్మ మరణించేక ఆయనకొక మూలగది కేటాయించేరు. వేళకు కాఫీ, టిఫిన్లు, భోజన సదుపాయం పూర్వంలా లేవు.

కోడలు కనబడదు. అన్నీ పనివాళ్లే; మంచినీళ్లు కూడా వాళ్లు ఇస్తారు. అవే తాగాలి. ఎప్పుడైనా కోడలు వచ్చినా మూర్తిగారికి వినబడదేమో అన్నట్లు బిగ్గరగా “ఇప్పుడు ఏం కావాలి మీకు? మందులు వేసుకున్నారా? ఈ రోజు నీళ్లు రావుట. జాగ్రత్తగా వాడుకోమన్నారు. కాసేపు ఆగి స్నానం చేద్దురు గాని. బట్టలు తడపకండి.” అని చెప్పి అంత స్పీడ్ గానూ వెళ్ళిపోతుందిట.

సిటీలలో అంతస్తుల కొద్దీ ఫ్లాట్లతో అపార్టుమెంట్లు నిర్మిస్తున్నారు. తరచు నీటి సమస్య, కరెంటు పోతే లిఫ్ట్ పనిచేయదు. చాల కష్టమైన బతుకులు. అందులోనూ నగర సివార్ల కరెంటు సమస్యలు మరీ ఎక్కువ.

ఇక మూడో అంతస్తులో ఫ్లాట్ లోని గోపాల రావుగారు ఆరు నెలల క్రితం కాలం చేసేరు. పెద్ద వయసు లోనే అనుకో. భార్య గిరిజమ్మకు డెబ్బై పైమాటే. ఆమెకు ఆరోగ్య సమస్యలు కొన్ని ఉన్నాయి.

కోడలు కావ్య తెల్లవారి వంటగది లోకి రానీయదట. తలుపు వేసేస్తుంది! “నాకు పని ఒత్తిడి, పిల్లలకు స్కూళ్ల కోసం వండాలి, కేరేజీలు సర్దాలి, భోజనం, టిఫిన్ ఇవ్వాలి. వాళ్ళను లేపి తయారు చెయ్యాలి. మీరు ఏడున్నర తర్వాత గాని వంట గదిలోకి రాకండి” అని ఖచ్చితంగా చెప్పేసిందట.

గిరిజమ్మ కూడ రావు గారు పోయేక దైన్యంగా తయారయింది. మిగత పిల్లలు విదేశాల్లో వున్నారు. ఆడ పిల్లలు తమ భర్తల దూర ప్రాంతాల్లో ఉద్యోగాల వల్ల తెలుగు రాష్ట్రాల్లో లేరు. మకాం మార్చాలి అంటే కొంత సమయం పడుతుంది కదా!

ఈ పరిస్థితులలో చాల మంది తమ పెద్దలను వృద్దాశ్రమాల్లో చేర్చేస్తున్నారు. పిండి కొద్దీ రొట్టె అన్నట్లు డబ్బులు కడితే సౌకర్యాలు – ఎసితో సహా వున్నవి కూడా లభిస్తున్నాయి కదా!

నెలకోసారి వెళ్లి చూని వస్తారట. ఎంతో ప్రేమ ఒలక బోసి, పళ్లు, స్వీట్లు, అవీ ఇస్తారట. మనుమలంతా “ఐ లవ్ యూ తాతయ్యా, లవ్ యూ మామ్మా” అంటూ గారాలు పోతారట. ఇవన్నీ కళ్లారా చూస్తూంటే బాధ వేస్తోంది జానకీ.

ఇంతకూ నీ సంగతి చెప్పు. విని సంతోషిస్తాను. మా మహిళా సంఘంలో సమావేశాల్లో ప్రస్తుత సమాజ సమస్యలు చర్చిస్తాము. నేను నీ గురించి చెప్తాను. కొందరయినా మారాలని ఆశ. కనువిప్పు కలగాలి కదా, రేపు మనం పెద్ద వాళ్లం అవుతాము!” ఇలా వ్రాసుకుని వచ్చింది విభ.

జానకి ఒకసారి తన గతంలోకి వెళ్లింది. తన భర్త మహేంద్ర ఫిజిక్స్‌లో డాక్టరేటు చేసేరు. చాలా కాలం క్రితం బరోడా యూని వర్సిటీలో ఉద్యోగం వచ్చింది. ప్రొఫెసర్‌గా రిటైరు అయ్యేరు.

మహేంద్రకు ఒకచెల్లెలు, తమ్ముడు వున్నారు. ఇద్దరూ విదేశాలలో స్థిరపడ్డారు. తన తండ్రి ఆనందరావు ఆంధ్రాలో ఒక కాలేజీలో లెక్చరర్‌గా పనిచేసేరు. తన తాత గారి గురించి ఎన్నో విషయాలు మహేంద్రకు తెలుసు. ఆరోజుల్లో వారిది చాల పెద్ద కుటుంబం. అమ్మాయిలు ఎక్కువ. ఇంటికి పెద్ద కావడం వలన ఆయనే పలు బాధ్యతలు నిర్వర్తించేరట. బామ్మగారు వారికి పూర్తి సహకారం అందించి, పొదుపుగా, గుట్టుగా సంసార జీవితం నెట్టుని వచ్చేరుట.

అలాంటి ఇంట్లో పుట్టడమే ఒక అదృష్టంగా భావిస్తారు. మహేంద్ర. బరోడా యూనివర్సిటీ వారు పక్కనే స్థలాలు సేకరించి, ప్రొఫెసర్లకు ఇళ్లు కట్టు కోవడానికి అనుమతులిచ్చేరు. అందువల్ల మహేంద్ర విశాలమైన ఇల్లు నిర్మించేరు. మంచి పెరడు. రకరకాల వృక్షాలు, మొక్కలతో చక్కని తోటు పెంచారు. అక్కడ కాసేవు కూర్చుంటే ఎంతో హాయి. పక్షుల కువకువలు, తేనెటీగల సవ్వడి; మనల్ని సేద తీరుస్తాయి.

మహేంద్ర తన తల్లిదండ్రులను తన దగ్గరే వుండమని కోరేడు “ఈ వాతావరణం బాగుంటుంది. మనం వూరికి కొంచెం దూరం గనుక హడావిడి, శబ్దకాలుష్యం వుండవు! తమ్ముడు, చెల్లాయి సెలవులకు వస్తూ వుంటారు!!” అని చెప్పేడు.

జానకి మామగారు ఖాళీగా లేరు. ఒక కాలేజీ వారు కోరినందున ఉద్యోగంలో చేరేరు. ఇంటి దగ్గర కూడా, కోరి వచ్చిన విద్యార్థులకు విశ్లేషించి సబ్జెక్టును బోధించేవారు. ఎందరో పేద విద్యార్థులను చేరదీసి, విద్య చెప్పి, భవిష్యత్తు తీర్చి దిద్దేరు. ఇటీవల కాలం చేసేరు.

అత్తమ్మ భర్త పోయిన దుఃఖంలో వుంది. ఆమె కూడా డెబ్భై సంవత్సరాల పై వయస్సులో ఉంది. కొంచెం కాళ్ల నెప్పులు, చిన్న రుగ్మతలు తప్ప, ఆరోగ్యం బాగానే వుంది.

బాగా ఆలోచించి జానకి ఒక నిర్ణయం తీసుకున్నది. తను బి.కాం చదివింది. ఆ రోజుల్లో సరదాగా దరఖాస్తు చేసుకున్నప్పుడు ప్రభుత్వ ఉద్యోగం లభించింది. వేళ ప్రకారం వెళ్లి పని చేసి వచ్చేసేది. ఇంట్లో కొన్ని పనులు చేసి వెళ్తే అత్తమ్మ మరి కొన్ని చూసే వారు. ఎంతో స్నేహ భావ బంధమది.

ప్రస్తుతం ఆమెను కంటికి రెప్పవలె చూడవలసిన బాధ్యత తనపై వున్నది అనుకుంది జానకి. నిజంగా ఉత్తరాది వారిని చూసి నేర్చుకున్న మంచి విషయమే ఇది.

ఇంకా తనకు నాలుగేళ్లు సర్వీసు ఉంది. కనుక వాలంటరీ రిటైర్మెంటుకు పెట్టుకుని, హాయిగా ఇంట్లో వుంది. అక్కడి వాళ్లు అత్తగారిని ‘మమ్మీజీ’ అంటారు. తల్లిలాగ చూస్తారు.

ఆ స్ఫూర్తితోనే తను కూడ సీతమ్మను నీడవలె కనిపెట్టుకుని వుంది.

ఉదయం దినచర్యలో దైవ ధ్యానం ఇద్దరూ కలిసి చేస్తారు. సాయాత్రం కాలనీలో నడక; ఆమె కొంత నడచి ఒక చోట విశ్రమిస్తే జానకి మరో రెండు రౌండ్లు నడిచి వస్తుంది. సమయంలో కూడ ఇద్దరూ కలిసి వుంటారు. పిండి వంటలు, పచ్చళ్లూ విషయాల్లో అత్తమ్మ సలహాలు తప్పనిసరి.

ఉత్తర భారతం పరిభాషలో ‘మమ్మీజీ’ను తను నీడ వలె అనుసరిస్తుంది, సీతమ్మ దుఃఖాన్ని మింగి జీవితం కొనసాగిస్తున్నది.

ఇవన్నీ విభకు చెప్పాలి. నిజమే ఇక్కడ పెద్దల పట్ల గల ప్రేమ, స్నేహం, గౌరవం – అదే ఆత్మీయత. మన ప్రాంతాల్లో ఇవే కరువై పోతున్నాయి. జానకి ఆలోచనల లోంచి నెమ్మదిగా బయటకు వస్తున్నది.

Exit mobile version