Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

ఆత్మ బంధువులు

[సింహాద్రి నాగశిరీష గారు రచించిన ‘ఆత్మ బంధువులు’ అనే కవితని పాఠకులకి అందిస్తున్నాము. సంచిక సాహితి ప్రచురణలు సంయుక్తంగా నిర్వహించిన 2025 శ్రీ విశ్వావసు ఉగాది కవితల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కవిత.]

నా ఆప్తులూ, ఆస్తులూ..
చిన్ననాటి నుండీ
ఉన్న నేటిదాకా
అమ్మ తరువాత అమ్మలై
నా మనసునెరిగిన నేస్తులై
మీరేగా..
నేను నవ్వుతున్నానంటున్నారంతా
నిజమే..
పెదవులు వికసించాయిగా
నేను అదృష్టవంతురాలినంటున్నారంతా
అదీ నిజమే..
నా వేషం డాబుగా ఉందిగా
వీళ్లంతా అద్దం లాంటి వాళ్ళే
నా బాహ్య రూపాన్ని చూస్తూ
నన్ను నాకు చూపిస్తున్న వాళ్ళే
ఎందరేమంటున్నా..
మీరేగా నన్ను నన్నుగా చూస్తోంది
నవ్వే నా పెదాలను గాక
నా గుండె కన్నీటిని తుడిచి
సుతారంగా మీ గుండెలకు హత్తుకుంది
డాబు వేషాల మాటున
జారిపోతున్న ఊబిలో
కొన ఊపిరితో కొట్టుకులాడుతున్న ప్రాణాన్ని
ఒడిసిపట్టుకుని
మీ ఒడిలో సేదతీరుస్తోంది
అందుకేనేమో..
ఆశ కవిత్వం రాయాలని ఆశగా ఉన్నా
ఎద లోతుల్లోంచి నవ్వాలని
మెత్తగా మందలిస్తునట్లుంది
నా మానసంలో ఉదయించి
నా చేతుల్లో
పురుడు పోసుకున్న ప్రతీసారీ
మీ నవ్వుల్లో
నాకు నా ఏడుపే వినిపిస్తోంది
అందుకే..
మీ కోసమైనా నవ్వటం నేర్చుకుంటా..
మీ నవ్వుల్లోనే నా నవ్వు వింటా
ఈ ఉగాది సాక్షిగా ఇక ఉదయిస్తా
ఆశ కవిత్వం ఆశువుగా రాసేలా..
ఎందుకంటే..
నా ఆస్తులూ ఆప్తులూ మీరేగా
నా తల్లులూ బిడ్డలూ కూడా మీరేగా
నా నేడు రేపులూ మీరేగా
క్షరం లేని
క్షారం కాని
నా ‘అక్షరాలే’గా
నా ఆత్మ బంధువులేగా..

Exit mobile version