అది వేసవి కాలంలో ఒక ఆదివారం. ప్రతి శనివారం విజయనగరంలోని ఇంటి కొచ్చి కుటుంబంతో గడిపి సోమవారం డ్యూటీ నిమిత్తం విశాఖ వెళతాను. ఆ ఆదివారం జిల్లా రచయితల సంఘం కన్వీనర్ ఫోన్ చేసి సాహితీ సభ ఉందని, ఆ సభలో కథల సంపుటి ఆవిష్కరించడానికి ప్రముఖ రచయిత ఎమ్.వి.వి. సత్యన్నారాయణ వచ్చారని చెప్పాడు. నా చిన్నతనంలో అపరాధ పరిశోధన చదివేవాడిని కాబట్టి రచయితగా ఎమ్.వి.వి. సత్యన్నారాయణ కథల ద్వారా తెలుసు. ఉత్సాహంగా ఆ సమావేశానికి వెళ్ళి ఎమ్.వి.వి.ని పరిచయం చేసుకున్నాను. ఆయిన తూ.గో. జిల్లా వాడని, ఆంధ్రా యూనివర్శిటీలో పని చేస్తున్నారని అప్పుడే తెలిసింది.
మా మధ్య పరిచయం తక్కువ కాలంలోనే అభివృద్ధి చెంది స్నేహంగా మారింది. ప్రతి రోజూ సాయంకాలం మున్సిపల్ కార్పొరేషన్ ఎదురుగా ఉన్న పార్కు (ఇప్పుడు లేదు) లో కూర్చుని సాహిత్యం గురించి చర్చించుకునే వాళ్ళం. అయిన నాకంటే సీనియర్ కనుక ఎన్నో ఆసక్తికరమైన కబుర్లు చెప్పేవాడు. ఆయనతో నా పరిచయం ఎంత తీవ్ర రూపం దాల్చిందంటే ఆయన రెండు రోజులు ఊళ్ళో లేకపోతే తట్టుకోలేక పోయేవాడిని. అలాంటి మనిషి పదవీ విరమణ చేసి హెచ్.బి. కాలనీలోని ఇల్లు అమ్మేసి హైదరాబాద్ వెళ్లిపోవడంతో నాకు పిచ్చెక్కినంత పనయింది. ఇరవై ఎనిమిదేళ్ళ స్నేహంలో మా మధ్య ఎన్ని కథలు, ఎన్ని నవలలు దొర్లాయో చెప్పడం కష్టం. సంక్రాంతి రోజు కూడా నేను రాస్తున్న నవల ఇతివృత్తం అడిగి మనస్ఫూర్తిగా అభినందించిన మనిషి ఆయన.
ఎమ్.వి.వి. సత్యన్నారాయణ గారి గొప్పదనం ఏమిటంటే, సాయలకాలం చర్చించిన కథని రాత్రి ఇంటికెళ్ళాక రాసేసి, ఉదయం డ్యూటీకి పోతూ పోస్ట్ డబ్బాలో పడేస్తారు. నా దృష్టిలోని రచయితగా అతను చాలా ప్రమాదకరమైన వాడు. విపుల మాసపత్రికలో ఎమ్.వి.వి. అనువాదం చేసిన కథలు వచ్చేవి. గత సంవత్సరం గాడ్ ఫాదర్, ఈ సంవత్సరం విక్టర్ హ్యూగో బీదల పొట్లు అనువాదం చేసారు. కొమ్మూరి సాంబశివరావు, అగాధ క్రిస్టీ వంటి ఉద్దండుల రచనలంటే ఆయనకి ప్రాణం.
హేతువాద దృక్పథం గల ఎమ్.వి.వి. ‘కొండమీద గొర్రెల మంద’, ‘నిజంగా పులే’ వంటి అద్బుతమైన కథలు రాయగలరు. రెమ్యునరేషన్ అందుకుని ఇంట్లోకి సరుకులు తెచ్చుకున్న రోజులు ఉన్నాయి అంటారు నిర్మలంగా నవ్వుతూ. సంక్రాంతి ఉదయం అరగంట సేపు ఫోనులో మాట్లాడిన వ్యక్తి, కనుమ రోజు కనుమరుగుమవడం ఎంత విషాదం. తెలుగు సాహిత్యంలో చెప్పుకోదగ్గ పాత్ర పోషించిన రచయిత ఎమ్.వి.వి. సత్యన్నారాయణ మన మధ్య నుంచి అదృశ్యం కావడం నిజంగా దురదృష్టకరం. మధ్యాహ్నం భోజనం చేసి దివాన్ కాట్ మీద కూర్చుని రాసుకుంటూ మహావృక్షం కూలినట్టు పక్కకి ఒరిగి అనాయాసంగా ప్రాణాలు విడవడం, మరణంలో కూడా నిరాడంబరత పాటించడం ఆయనకే చెల్లింది.
నివాళి!