[సుగుణ అల్లాణి గారు రచించిన ‘ఆనందమా!’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
ఆనందమా!
నీవెక్కడ!!
మనుసు గదిలో
కొక్కానికి వేలాడినట్టు
ఎదురుగానే ఉంటావు
నా దరి చేర రావు
ఒకప్పుడు
ఎప్పుడూ
నాతోనే ఉండేదానివి
ఇప్పుడేంటో అలా దూరంగా
నను చూస్తూ నిలబడినావు!
అప్పుడు..
ఓ బొమ్మను చూసినా
అమ్మ నవ్వును చూసినా
నచ్చిన గౌను వేసుకొన్నా
ఇంటికెవరైనా వచ్చినా
పండగలైనా మంచి పాట విన్నా
బడిలో మాస్టారు మెచ్చుకొన్నా
ఇంట్లోనాన్న అక్కున చేర్చుకొన్నా
ఆటల్లో ఆడి గెలిచినా
ముఖం నిండా ఆవరించి వంటి నిండా ప్రవహించేదానివే!!
మనుసులో పరుగులు తీసేదానివే!!
కాలు నిలవకుండా కదం తొక్కేదానివే
కన్నెమనుసు కన్న పగటి కలకే
కళ్ల ముందు స్వర్గం చూపేదానివే!!
ప్రేమ నిండిన ఒక చూపుకే పరవశించేదానివే!!
ఇప్పుడేది నీ అస్తిత్వం
చుట్టూ అందరున్నా
చుట్టపు చూపుగా వస్తావు
ఇళ్లువాకిళ్లు ఎన్ని ఉన్నా
నిర్లిప్తంగా చూస్తూ ఉంటావు
కీర్తి వాసి ఎంతున్నా
పట్టనట్టుంటావు కదా!!
అన్నీ ఉన్నా ఏదో వెలితి
ఎదురుగానే ఉన్నట్టుంటావు
దోబూచులాడుతావు
ఎక్కడ నిన్ను వెతికేది
ఎలా నిన్ను పొందేది
డబ్బుపెట్టి నిన్ను కొనగలిగితే
కోట్లు పోసి కొనడానికి పోటీ పడేవారేమో
పొరపాటున కూడా అంగట్లోకి రాకు
రేటు కట్టి వేలం వేస్తారు
కళ్ల నిండా నిన్ను నింపుకుని
మనుసారా నిన్ను అనుభవించాలని
ఆశగా ఉంది..
ఆ పసితనంలో నన్నాదరించినట్లు
నను చెయ్యారా చేరదీయవా!!!
శ్రీమతి అల్లాణి సుగుణ పుట్టి పెరిగింది హైదరాబాద్లో. అత్తవారిల్లు కూడా హైదరాబాదే! పదవ తరగతి పూర్తవుతూనే పదహారేళ్లకు పెళ్లైతే, ఆ తర్వాత MA B.Ed వరకు చేయగలిగారు.
వారి శ్రీవారు మడుపు శ్రీకృష్ణారావు గారు విశ్రాంత బ్యాంక్ ఉద్యోగి. వారికి ఒక్కగానొక్క కూతురు. ఆర్కిటెక్ట్. చదువు మీద అత్యంత ఆసక్తి, ప్రీతి కలిగిన రచయిత్రి అత్తగారు శ్రీమతి లక్ష్మీబాయి గారు సుగుణగారిని కాలేజీకి పంపి చదివించారు. ఆ ప్రోత్సాహమే ఈనాడు తాను రచయిత్రి/కవయిత్రిగా పరిచయం చేసుకొనే అవకాశం కలిగిందని చెప్పడానికి గర్విస్తారు.
ముప్పై సంవత్సరాలు వివిధ పాఠశాలలలో తెలుగు అధ్యాపకురాలిగా చేసి ప్రస్తుతం మనుమలతో ఆడుకుంటున్న అదృష్టవంతురాలినని అంటారు సుగుణ. ఈ విశ్రాంత జీవనంలో అప్పుడప్పుడు అన్నమయ్య కీర్తనలు పాడుకుంటూ iPad లో కథలు చదువుతూ చిన్న చిన్న కవితలు కథలూ రాస్తూ TV లో సినిమాలు చూస్తూ స్నేహితులను కలుస్తూ కావలిసినంత సంతోషాన్ని పంచుతూ ఆనందపడుతూ కాలం గడుపుతూ ఉంటారు.