Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

ఆధ్యాత్మికతకు తొలి మెట్టు సగుణ ఆరాధన

[శ్రీ సి.హెచ్. ప్రతాప్ గారి ‘ఆధ్యాత్మికతకు తొలి మెట్టు సగుణ ఆరాధన’ అనే రచనని అందిస్తున్నాము.]

భగవద్గీత 7వ అధ్యాయం 21వ శ్లోకం ఈ విధంగా వుంది.

యో యో యాం యాం తనుం భక్త: శ్రద్ధయార్చితుమిచ్ఛతి।
తస్య తస్యాచలాం శ్రద్ధాం తామేవ విదధామ్యహమ్॥

ఓ అర్జునా, ఒక భక్తుడు ఏ దివ్య రూపాన్ని విశ్వాసంతో, భక్తిశ్రద్ధలతో పూజించాలని కోరుకుంటాడో, అటువంటి భక్తుని విశ్వాసాన్ని నేను ఆ రూపంలో స్థిరపరుస్తాను అని శ్రీకృష్ణుడు పై శ్లోకం ద్వారా తెలియజేస్తున్నాడు.

ఈ సృష్టిలో 33 కోట్ల దేవుళ్ళు వున్నారని శాస్త్రం చెబుతోంది. వేర్వేరు ప్రయోజనాల కోసం, వేర్వేరు కోరికల కోసం వేర్వేరు దేవుళ్లను పూజించే ప్రజల విశ్వాసాన్ని తాను ధృవీకరిస్తానని భగవంతుడు ఇక్కడ ప్రకటిస్తున్నాడు. అంతే రూపం ప్రధానం కాదని, భక్తుల హృదయాలలో భక్తిశ్రద్ధలు ముఖ్యమని, ఏ రూపాన్ని ఆరాధించినా తాను ఆ రూపంలో కరుణిస్తానని భగవంతుడు స్పష్టం చేస్తున్నాడు. పరమాత్మ ప్రేమ అనంతం. ఆయన ఈ సృష్టిలో ప్రతీ అణువులో వున్నాడు, కాబట్టి 33 కోట్ల దేవతలలో వున్నాడు. విభిన్న దేవతలందరిలోనూ ఉన్నాడు. కాబట్టి మనిషి వాటిని విశ్వాసంతో పూజించినప్పుడు, అతని విశ్వాసాన్ని భగవంతుడు స్వయంగా దృఢంగా చేస్తాడు. గమనించవలసిన విషయం ఏమిటంటే, ఏదో ఒక రూపంలో విశ్వాసం ఉంటే, అలాంటి విశ్వాసం భగవంతుడి ద్వారా బలపడుతుంది. ఈ ఆరాధననే సగుణ ఆరాధన అని అంటారు.

కలియుగ సద్గురువు అయిన శ్రీ సాయినాధులు కూడా సగుణ ఆరాధనకే అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు. సగుణ స్వరూపమునకు ఆకారము ఉంటుంది కాని నిర్గుణము అంటే ఆకారము లేదు. రెండును పరబ్రహ్మ స్వరూపములే. మొదట్లో సగుణ స్వరూపమే మనకు అనువుగా ఉంటుంది. భక్తి వృద్ధి చెంది, జ్ఞానం కలిగితే అప్పుడు నిర్గుణ ఆరాధన కుదురుతుంది. బాబా అందుకే తనను నిర్గుణంగా ఆరాధించమని చెప్పి అలా కుదరకపోతే అప్పుడు నన్ను సగుణంగా పూజించండి అని చెప్పారు. భక్తిపై గట్టి నమ్మకం ఉండాలి అని సాయి చెప్పారు. ఆయన రకరకాల దేవతలా రూపంలో దర్శనం ఇచ్చారు. అలానే వేరే గురువుల రూపంలో కూడా దర్శనం ఇచ్చారు. త్రిగుణాత్మకమైన ప్రకృతిని ప్రసన్నం చేసుకుని భగవంతుడిని చేరడానికి పరమ శ్రేయస్కరమైన మార్గమే ‘సగుణ ఆరాధన’ అని శాస్త్రం చెబుతోంది. మన కష్టాలను భగవంతునికి చెప్పుకుని,రక్షించమని వేడుకుంటూ, మనకి జరిగే మంచి చెడులతో నిమిత్తం లేకుండా ‘ప్రభూ! ఇదంతా నీకోసం, నువ్వు నాకు కావాలి’అనే ఆర్తితో, నిత్యం ఆయనను పూజించుకోవడం ప్రార్థించుకోవడమే సగుణ ఆరాధన అవుతోంది.

భగవంతుని లీలలను వినడం, కీర్తనలు లేదా ఆయన నామాలను పాడటం, భగవంతుని నిరంతరం స్మరించడం, ఆయన పాద సేవ, పుష్పాలు అర్పించడం, సాష్టాంగ నమస్కారం, ప్రార్థన, మంత్ర జపం, ఆత్మ సమర్పణ, భాగవత సేవ, భగవంతునిపై అచంచల విశ్వాసంతో మానవాళికి మరియు దేశానికి సేవ చేయడం మొదలైనవి సగుణ ఉపాసనగా నిర్వచించబడ్డాయి.

సగుణ ధ్యానంలో, భక్తుడు తనను తాను పూజించే వస్తువు నుండి పూర్తిగా భిన్నమైన వ్యక్తిగా భావిస్తాడు. ఆరాధకుడు భగవంతుడికి పూర్తిగా, నిష్కళంకంగా, నిరాడంబరంగా, ఆత్మసమర్పణ చేసుకుంటాడు. అతను భగవంతుడిని గౌరవిస్తాడు, గౌరవిస్తాడు, ఆరాధిస్తాడు మరియు ఆహారం, రక్షణ మరియు అతని ఉనికి కోసం ప్రతిదానికీ ఆయనపై ఆధారపడతాడు. అతను ఎల్లప్పుడూ ఇష్ట దేవత నుండి ఏదైనా సహాయం కోసం చూస్తాడు. సగుణ ఉపాసన చేయనిదే నిర్గుణ ఉపాసన సాధ్యం కాదని మన మహర్షులు స్పష్టం చేసారు. అందుకే ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణం ప్రారంభించేవారికి సగుణ ఉపాసన తొలి మెట్టు.

Exit mobile version