జనపదం అంటే పల్లె. అందులో ఉండే వాళ్లు జానపదులు. వాళ్లు పాడుకొనే పాటలు జానపద గేయాలు. ఇంగ్లీషులో Folk Songs అంటారు. ఉత్తరాది వాళ్లు వీటిని ‘లోక్గీత్’ లంటారు. భారతంతో కర్ణ, శకుని, దుర్యోధనులు మంతనాలు చేసేటప్పుడు ‘జానపదుల్ పురీజనులు సంతసమున్ బ్రమదం బెలర్పనీ/దైనశుభోదయంబ హృదయంబుల గోరుచునున్నవారు’ అని ఉంటుంది. అర్బన్/రూరల్ అన్న తేడా ఇక్కడ స్పష్టం.
ఈ సాహిత్యం మౌఖికంగానే ఉంటుంది. అంటే వ్రాయబడదు. కథలు, సామెతలు, పొడుపు కథలు, మాండలీకాలు, యాసలు, నుడికారాలు, తిట్లు అన్నీ ఇందులో చేరతాయి. వారి వృత్తులు, సాంఘికాచారాలను కూడా ఈ పాటల్లో ప్రస్తావిస్తారు. ఇవి ప్రదర్శించడానికి వీలుగా ఉంటాయి. Performing Arts అన్నమాట. ఇందులో గేయం, వచనం, రూపకం అనే మూడు ప్రక్రియలుంటాయి.
పద్యం కన్నా ముందే పదం పుట్టిందంటారు. నాగరికత ప్రారంభంలోనే నాట్యం పుట్టింది. కొన్ని మాటలు లయతో అంటూ ఆడుతూ తమ కష్టాన్ని మరచిపోయేవారు గ్రామీణ శ్రామికులు. ఈ పాడ చూడండి. ‘కొండన్న మాదన్న నారికేళో, వేటపోయే రాములు నారికేళో/బంగారి బొడ్లో బాకు, పిడికెడు వడ్లు తీసి/కొనగోర వొలిచే చిక్కుడు పువ్వులు/సిరిగె తోమి కొనగోర బియ్యమొలిచె/మా చేత పోటేసిరా, అమ్మలావాయమ్మ/నీళ్లైన ఇయ్యవమ్మ, మీ అమ్మ మరదల/నేను ఉండా మరది’. ఇది ఒక గుంపు వ్రాసింది. దీన్ని పాడుతూ ఆడేటప్పుడు చతురశ్ర గతికి నిరోధకములైన పదాలను, వారి కనుకూలంగా మార్చుకుంటారు. అప్పుడప్పుడు యతులు, ప్రాసలు కూడా ‘సహజంగా’ పడతాయి.
జానపద గేయాలకు ప్రత్యేకముగా కవులుండరు. అది సమిష్టి సృష్టి. దానికొక నియమిత స్వరూపముండదు. ఇవి జనం నోళ్లలోనే జీవిస్తాయి. ప్రసిద్ధి పొందుతాయి. దీన్నే అనుశృత ప్రచారం అంటారు. వీటిలో ఆత్మపరత్వం (Subjective Element) ఎక్కువ. ‘బొబ్బిలిపదం’ వ్రాసినవాడు పెద్దాడ మల్లేశం అని ఎందరికి తెలుసు? అయినా ఆ వీరగాథ పరమ ప్రసిద్ధం. కారణం దానిలోని సార్వజనీనత. “రామ రామ అనంతమాలము రాజ్యమేల లేము – చచ్చిన వారికి వీరస్వర్గము ఇక్కడ కలుగును” అంటాడు బొబ్బిలిపులి తాండ్ర పాపయ్య! ‘కాటమరాజు కథ’ను వ్రాసినవాడు పినయెల్లడు. దానిని పాడే ప్రతి గొల్లడు వీరావేశంతో ఆ పదం తనదే అనుకుంటాడు. అలా రసికులను సహృదయులను ఆనందంతో ఓలలాడించేవే జానపదగేయాలు.
శ్రీయుత బిరుదరాజు రామరాజు గారికి కృతజ్ఞతలతో

శ్రీ పాణ్యం దత్తశర్మ 1957లో కర్నూలు జిల్లా వెల్దుర్తిలో పుట్టారు. తండ్రి శతావధాని శ్రీ ప్రాణ్యం లక్ష్మీనరసింహశాస్త్రి. తల్లి శ్రీమతి లక్ష్మీనరసమ్మ. టెంత్ వరకు వెల్దుర్తి హైస్కూలు. ఇంటర్, డిగ్రీ, ఎం.ఎ. (ఇంగ్లీషు), ఎం.ఎ. (సంస్కృతం), ఎంఫిల్, పిజిడిటియి (సీఫెల్), ప్రయివేటుగానే.
దత్తశర్మ ఇంటర్మీడియట్ విద్యాశాఖలో లెక్చరర్గా, ప్రిన్సిపాల్గా, రీడర్గా, ఉపకార్యదర్శిగా సేవలందించారు. కవి, రచయిత, విమర్శకులు, గాయకులు, కాలమిస్టుగా పేరు పొందారు. వీరివి ఇంతవరకు దాదాపు 50 కథలు వివిధ పత్రికలలో ప్రచురితమై వాటిలో కొన్ని బహుమతులు, పురస్కారాలు పొందాయి.
వీరు ‘చంపకాలోచనమ్’ అనే ఖండకావ్యాన్ని, ‘Garland of poems’ అన్న ఆంగ్ల కవితా సంకలనాన్ని, ‘దత్త కథాలహరి’ అన్న కథా సంపుటాన్ని ప్రచురించారు. వీరి నవల ‘సాఫల్యం’ సంచిక అంతర్జాల పత్రికలో 54 వారాలు సీరియల్గా ప్రచురితమై, పుస్తక రూపంలో ప్రచురింపబడి అశేష పాఠకాదరణ పొందింది. 584 పేజీల బృహన్నవల ఇది. ‘అడవి తల్లి ఒడిలో’ అనే పిల్లల సైంటిఫిక్ ఫిక్షన్ నవల సంచిక డాట్ కామ్లో సీరియల్గా ప్రచురించబడింది.
వీరికి ఎ.జి రంజని సంస్థ కవి సామ్రాట్ విశ్వనాథ పురస్కారాన్ని, ‘తెలంగాణ పాయిటిక్ ఫోరమ్’ వారు వీరికి ‘Poet of Profundity’ అన్న బిరుదును, బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంవారు వీరి సిద్ధాంత గ్రంథానికి అవార్డును, సి.పి. బ్రౌన్ సమితి, బెంగుళూరు వారు వీరికి ‘NTR స్మారక శతకరత్న’ అవార్డును బహూకరించారు.
ఇద్దరు పిల్లలు. ప్రహ్లాద్, ప్రణవి. కోడలు ప్రత్యూష, అల్లుడు ఆశిష్. అర్ధాంగి హిరణ్మయి. సాహితీ వ్యాసంగంలో రచయితకు వెన్నుదన్నుగా ఉన్న గురుతుల్యులు, ప్రముఖ రచయిత వాణిశ్రీ గారు. వీరు – తమ సోదరి అవధానం లక్ష్మీదేవమ్మ గారు, మేనమామ శ్రీ కె. సీతారామశాస్త్రి గార్లకు ఋణగ్రస్థులు.